Shaka Purushudu NTR : నిజమే మరి.. ఎన్టీఆర్ యుగపురుషుడు కాదు శక పురుషుడే. ఒక శకానికి గానీ అలాంటి వ్యక్తి మళ్లీ జన్మించలేరు. ఆహార్యం, దాతృత్వం, చిరునవ్వు, అందం ఇవన్నీ ఆయన కణకణంలో నిబిడీకృతమై ఉన్నాయనడంలో సందేహం లేదు. యంగ్ జనరేషన్ హీరోయిన్లతో చేసిన సమయంలో ఆయన చిలిపిగా ఉన్న యంగ్ హీరో బయటకు వస్తాడు. మనుమడికి తాతగా చేసిన సమయంలో అదే వయస్సులో తాతగా కూడా కనిపిస్తారు. ఇక పార్టీ పెట్టడంతోనే ఆంధ్ర, తెలంగాణ ప్రజలకే కాదు దేశానికి సైతం అన్నగా మారిపోయారు ఎన్టీఆర్. అందుకే ఆయనను శక పురుషుడు అంటున్నాం.
28 మే, 1923లో కష్ణా జిల్లా, గుడివాడ తాలూకా, నిమ్మకూరు గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు నందమూరి తారక రామారావు. అందరిలాగే చిన్నతనంలో కష్టాలు, కన్నీళ్లు చవిచూశారు ఆయన తన పెద్ద నాన్న రామయ్యకు నాటకాలంటే చాలా ఆసక్తి, ఆయన గుణమే రామారావుకు వచ్చింది ఎన్టీఆర్ కు కూడా నాటకాలు, సినిమాలంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. తను కాలేజీ చదివే రోజుల్లో అధ్యాపకుడిగా ఉన్న కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రోత్సాహంతో పలు నాటకాల్లో వివిధ పాత్రలు పోషించారు ఎన్టీఆర్. ఇందులో నాయకురాలు నాగమ్మ ఆయనకు గుర్తింపు సంపాదించి పెట్టింది. ఇక ఆ తర్వాత తన స్నేహితులు జగ్గయ్య, పుండరీకాక్షయ్యతో కలిసి విపరీతమైన నాటకాలు వేసేవారు ఎన్టీఆర్.
కేవలం నాటకాలే కాకుండా విద్యపై కూడా ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టేవారు. ఒక సందర్భంలో ఎల్వీ ప్రసాద్ సినిమాను కూడా ఆయన కాదనుకున్నారు. చదువు తర్వాతే సినిమాల్లోకి వస్తానని చెప్పారు ఆయన. బీఏ పూర్తి చేసిన ఆయనను సర్కార్ కొలువు వరించింది. సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగంలో చేరాడు. ఆయన అక్కడే ఉంటే శక పురుషుడు కాలేడేమో. అందుకే ఆ ఉద్యోగం ఆయనకు అస్సలు నచ్చలేదు. దీంతో ఆయన చెన్నై బయల్దేరి వెళ్లారు. ఆ సమయంలో ఎల్వీ ప్రసాద్ మనదేశం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చిత్తూరు నాగయ్య, సీహెచ్ నారాయణ రావు నటిస్తున్నారు. మీర్జాపురం రాజాకు భార్య, నటి కృష్ణవేణి ఇందులో హీరోయిన్. ఈ మూవీలో రామారావు పోలీస్ అధికారిగా చిన్నపాత్రలో కనిపంచాడు. ఆ తర్వాత వచ్చిన ‘పల్లెటూరిపిల్ల’ సినిమాలో ఏకంగా ఎన్టీఆర్ హీరోగా చేశారు.
నందమూరి కన్నా సీనియర్ ఆర్టిస్ట్ అక్కినేని నాగేశ్వర్ రావు. ‘పల్లెటూరిపిల్ల’లో ఆయన కూడా కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ కొట్టింది. ఇక అప్పటి నుంచి నందమూరి తారక రామారావు ప్రతీ ఒక్కరి హృదయంలో కొలువై ఉన్నాడు. అనేక భక్తిరస చిత్రాల్లో రాముడు, కృష్ణుడిగా కనిపించిన ఆయన రావణాసురుడు, దుర్యోదనుడు లాంటి విలన్ పాత్రల్లో కూడా నటించి మెప్పించారు.
సినిమాల్లో ఉండగానే ఆంధ్రప్రదేశ్ కు వరదలు వచ్చినప్పుడల్లా, కరువు కాటకాలు ప్రబలినప్పుడల్లా ఆయన చేతులు జోడించి విరాళాలు సేకరించేవారు. ప్రజా సేవనే ఆయన జీవితంలో పరమావధిగా పెట్టుకున్నారు. సినిమా జీవితం చరమాంకం వచ్చే సరికి ఆయన టీడీపీ పార్టీని పెట్టారు. 29 మార్చి, 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఆ తర్వాత తొమ్మిది నెలల్లోనే ఆయన అధికారంలోకి వచ్చారంటే ఆయనపై ఆంధ్రాజనానికి ఉన్న గురి ఏటువంటిదో తెలుసుకోవచ్చు. రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు ఎన్టీఆర్. సినిమాల్లో చేస్తూనే పార్టీలో అన్ని పనులు చేసేవారు. యుగ పురుషుడిగా కీర్తి గడించిన ఆయన 18 జనవరి, 1996న పరమపదించారు. ఆయన ఒక వ్యక్తి కాదు శక్తి. రాముడు, కృష్ణుడు, బలరాముడు, విష్ణుమూర్తి, ఇలా ఏ అవతారంలోనైనా సాక్షాత్తు దేవుడిలా కనిపించేవారు ఎన్టీఆర్.
ఆయన శక జయంత్యుత్సవాలు తెలుగుదేశం పార్టీ గ్రాండ్ గా నిర్వహిస్తోంది. రాజమండ్రిలో దీని కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మే 28 నుంచి రెండు రోజులు కొనసాగే ఈ వేడుకల్లో చంద్రబాబు నాయుడుతో సహా ప్రముఖులు, సినీ నటులు పాల్గొననున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.