Sharmila : విశాఖలోని స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందని డెక్కన్ క్రానికల్ లో వచ్చిన కథనం రాజకీయంగా ఏపీని కుదిపేస్తోంది. ఆ పత్రిక రాసిన కథనంపై మినిస్టర్ నారా లోకేష్ స్పందిస్తూ.. ఇది వైసీపీ కుట్ర అన్నట్లు అభివర్ణించారు. విశాఖ ఇమేజ్ నాశనం చేసేందుకే ఇది రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ కథనంపై ఏపీలో ఒక్కసారిగా ఫోకస్ పెరిగింది.
కథనంపై ఏపీలో రచ్చ..
విశాఖ ప్లాంట్ పై డెక్కన్ క్రానికల్ (డీసీ) రాసిన కథనంపై టీడీపీ సీరియస్ అయ్యింది. ఆ కార్యాలయం డిస్ ప్లే బోర్డును ఆ పార్టీ కార్యకర్తలు తగులబెట్టారు. కార్యాలయంపై దాడి, నారా లోకేశ్ ఆరోపణలపై మాజీ సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు అన్న బాటలోనే షర్మిల కూడా టీడీపీని ఎటాక్ చేసింది.
ఖండించిన షర్మిల
విశాఖ డీసీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తల దాడిని వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మొన్నటి వరకు జగనే టార్గెట్ అంటూ రాజకీయాలు నడిపిన షర్మిల ఇప్పుడు జగన్ కు వత్తాసు పలకడంతో పాటు ఆయనతో కలిసి టీడీపీపై విరుచుకు పడ్డారు. ఈ ఘటనను జగన్ తో ఏకీభవిస్తున్నట్లు కూడా ఆమె చెప్పారు.
దమ్ముంటే మోడీని నిలదీయండి
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోలేక ఇలాంటి చర్యలు తీసుకోవడం మంచిది కాదని, పైగా ప్రశ్నించిన వారిని విమర్శించడం మరింత దిగజారుడుతనం అవుతుందని ఆమె అన్నారు. ఇప్పటికైనా బాబు మేలుకోకుంటే ప్రజలు మీకు జవాబు చెప్తారని తేల్చి చెప్పారు. దమ్ముంటే మోడీని నిలదీయండి, అంతే కానీ నిలదీసే గొంతులను నొక్కాలని చూడడం సరికాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం కోసం పాటుపడే పార్టీగా కాంగ్రెస్ ఇలాంటి దాడులను వ్యతిరేకిస్తుందని షర్మిల పేర్కొన్నారు.
షర్మిల ఫోకస్ మారుతుందా?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కొత్త చర్చ జరుగుతుండగా డీసీ వార్త వ్యవహారం ఏపీలో దుమారంగా సృష్టించడంతో పాటు రాజకీయంగా రచ్చకు దారి తీసింది. తాజా స్పందనతో షర్మిల ఫోకస్ ఇక నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఫిక్స్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.