unemployment March : తెలంగాణ పాలిటిక్స్ ఈ సారి కొత్త మలుపు తిరుగుతాయా.? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పొత్తులతో ఆదరణ కోల్పోయిన బీజేపీ ఇప్పుడు పుంజుకుంటున్నది. దాదాపు తెలంగాణ ఆవిర్భావం నుంచి పార్టీని పవర్ లోకి తెచ్చేందుకు కేంద్ర నాయకత్వం పక్కా వ్యూహాలను అమలు చేస్తూ వస్తుంది. స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత కొన్ని రోజులు స్తబ్ధుగా ఉన్న బీజేపీ మెల్లమెల్లగా గల్లీ నుంచి కార్యకర్తలను పోగు చేసుకుంటూ వచ్చింది. మోడీ పాలన ఫలాలను చూపెడుతూ యువత ఎక్కువగా పార్టీ వైపు ఆకర్షించేలా చేసింది. ‘డబుల్ ఇంజిన్ పాలన’ కావాలని యువతతో అనిపిస్తూ ఇందులో సక్సెస్ కూడా అయ్యింది.
నిజాం పాలన, నిజాంను ఎదురించేందుకు నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో ఆ తర్వాత లెఫ్ట్ పార్టీలు, లేదంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇక్కడ బీజేపీకి అంత ప్రాచుర్యం దక్కలేదు. టీడీపీ ఏర్పాటు తర్వాత ఎన్టీఆర్తో పలు దఫాలుగా బీజేపీ పొత్తు పెట్టుకుంటూ వచ్చింది. దీంతో బీజేపీ కేడర్ కాస్తా టీడీపీ కేడర్ గా మారిపోయింది. ఇక ప్రత్యేక రాష్ర్టం ఉద్యమం నేపథ్యంలో టీడీపీ విలన్ గా మారింది. టీడీపీ కేడర్ కూడా బీఆర్ఎస్ (టీఆర్ఎస్)కు కన్వర్ట్ అయిపోయిందనే చెప్పాలి. ఇక బండి సంజయ్ బీజేపీ స్టేట్ చీఫ్ బాధ్యతలు తీసుకున్నాక పార్టీకి మళ్లీ జవసత్వాలు వచ్చాయి. బీఆర్ఎస్-ఎంఐఎం దోస్తీ, హిందూయిజంను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. వీటితో పాటు బీఆర్ఎస్ పాలనపై విరుచుకుపడ్డారు. ‘ప్రజా సంగ్రమ యాత్ర’ పలు దఫాలుగా నిర్వహించారు. అందులోనూ సక్సెస్ అయ్యారు. ఐతే బండి పదవీ కాలం ఇటీవల పూర్తయినా కేంద్ర నాయకత్వం మళ్లీ ఆయన పదవీ కాలం పొడిగించింది.
‘ప్రజా సంగ్రమయాత్ర’ ‘నిరుద్యోగ మార్చ్’ లాంటి ఉద్యమ కార్యాచరణను రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బండి సక్సెస్ అయ్యారు. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా బీజేపీ నిరుద్యోగమార్చ్ కు పిలుపునిచ్చింది. మే 12న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్షలాది మంది నిరుద్యోగులు పాల్గొనేలా పార్టీ శ్రేణులు కష్టపడి పని చేశాయి. దీంతో నిరుద్యోగ మార్చ్ సక్సెస్ అయ్యింది. నిరుద్యోగులతో కలిసి బండి సంజయ్ పట్టణంలోని ఐబీ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు పాదయాత్ర చేశారు. ఆయన వెంట లక్షలాది మంది నిరుద్యోగులు నడిచారు. జన సందోహం ఎక్కువ రావడంతో బీజేపీ నిరుద్యోగ మార్చ్ సక్సెస్ గా మారింది.