
భారతీయ జనతాపార్టీ నేత, మాజీ టీడీపీ నాయకుడైన సుజనా చౌదరి వచ్చే ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గాల్లోనే గెలవగలిగింది. ఇక్కడి నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉంటారని, లేదంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేస్తారంటున్నారు.
రాజకీయాల నుంచి విరమించుకుంటారా? ఈ రెండూ జరగని పక్షంలో రాజకీయాల నుంచి గల్లా విరమించుకుంటారని తెలుస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ మరో అభ్యర్థిని వెతుక్కోవాల్సి వస్తోంది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకొని వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ఈ రెండు పార్టీలు భారతీయ జనతాపార్టీ కోసం వేచిచూస్తున్నారు. ఆ పార్టీ ఎన్నికలకు 6నెలల ముందు పొత్తుల గురించి మాట్లాడవచ్చు.. ఇప్పుడే ఎందుకనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కూడా కలిసివస్తే పొత్తులో భాగంగా బీజేపీకి గుంటూరు నియోజకవర్గాన్ని కేటాయించే అవకాశం ఉంది.
సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ లో చేరతారని, గుంటూరు నుంచి ఆ పార్టీ ఎంపీగా బరిలోకి దిగుతారని తెలుస్తోంది. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరిన పక్షంలో ఆ పార్టీ నుంచే ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తారంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నాయకులతో సుజనాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవలే గుంటూరు వచ్చిన సుజనా టీడీపీకి చెందిన ఆలపాటి రాజా, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు తదితరులతో భేటీ అయ్యారు.
తెలుగుదేశం పార్టీ తరఫున రెండుసార్లు రాజ్యసభకు ఎంపికైన సుజనా చౌదరి ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో నేరుగా తలపడలేదు. ఒకవేళ గుంటూరు బరిలో నిలిస్తే ఇదే ఆయన మొదటి ప్రత్యక్ష ఎన్నికల పోరు అవుతుంది. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ గాలిలో గుంటూరులో టీడీపీ గెలవగలిగింది కాబట్టి ఈసారి ఎన్నికల్లో కూడా ఇక్కడినుంచి పోటీచేస్తే సులువుగా విజయం సాధించవచ్చనేది సుజనా యోచనగా ఉంది.






