
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ ఆటతీరు బాగాలేదు. బ్యాటింగ్ లో విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు లీగ్ మ్యాచ్ లలో చెప్పుకోదగ్గ స్కోరేమీ చేయలేకపోయాడు. కానీ కోహ్లి తిరిగి ఫామ్ లోకి వస్తాడని భారత్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పూర్తి నమ్మకంతో ఉన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024లో 15 మ్యాచ్ల్లో 61.75 సగటుతో 741 పరుగులు చేశాడు, ఈ ఏడాది టోర్నమెంట్లో అత్యధిక పరుగుల స్కోరర్గా నిలిచాడు. కానీ ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో విరాట్కు ఆటతీరు నెమ్మదించింది. న్యూయార్క్లోని కష్టతరమైన పిచ్పై, విరాట్ ఓపెనింగ్ స్లాట్లో పరుగులు చేయడానికి చాలా ఇబ్బందిపడ్డాడు. మూడు మ్యాచ్లలో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు. అతని అత్యధిక స్కోరు కేవలం నాలుగు పరుగులు మాత్రమే.
గత శనివారం, ఫ్లోరిడాలో బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్ పై కెనడా మీద పరుగులు చేయడానికి విరాట్కు అవకాశం లభించింది. కానీ వర్షం కారణంగా అవకాశం చేజారింది. భారత్ తొలి రౌండ్లో ఏడు పాయింట్లతో ముగించి గ్రూప్-ఎలో అగ్రస్థానంలో నిలిచింది. సహ-ఆతిథ్య అమెరికాపై విజయం సాధించిన తర్వాత రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఇప్పటికే సూపర్ 8కి అర్హత సాధించింది. గురువారం కెన్సింగ్టన్ ఓవల్ బార్బడోస్లో ఆఫ్ఘనిస్థాన్తో భారత్ తన మొదటి సూపర్ 8 మ్యాచ్ ఆడనుంది.
ఓపెనర్గా ఐపీఎల్లో స్వదేశంలో దూకుడు ఆటను యూఎస్ఏలో ప్రదర్శించలేకపోయాడు కోహ్లీ. సీనియర్ అయిన కోహ్లీ ఈ విషయాన్ని ముందే గ్రహించాల్సి ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నార. ఇక్కడి పిచ్ లపై బంతిని పైకి లేపితే వికెట్ను కోల్పోయే ప్రమాదం ఉంది. యూఎస్ఏ పిచ్ల్లో.. ఎక్కువగా గ్రౌండ్ షాట్లు కొట్టే కోహ్లీ విఫలం కావడం కూడా మిగతా బ్యాటర్లకు గుణపాఠం లాంటిదే. ఇక బ్యాటింగ్కు సహకరించే విండీస్ పిచ్లపైనైనా కోహ్లీ మునుపటి ఫామ్ను అందుకుంటే భారత్ కప్ను దక్కించుకోవడం పెద్ద కష్టమేం కాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు.
బ్యాటింగ్కు అనుకూలమేనా?
భారత్ ఆడే సూపర్-8 మ్యాచులకు విండీస్ వేదిక కానుంది. అక్కడి పిచ్లు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటాయని విశ్లేషకుల అభిప్రాయం. అదే సమయంలో స్పిన్నర్లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. విండీస్ స్పిన్నర్లు వికెట్లు పడగొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. విరాట్ కోహ్లీకి విండీస్లో వన్డే ఫార్మాట్లో అద్భుత మైన రికార్డులు ఉన్నాయి. కానీ, టీ20ల్లో అంతగా రికార్డులేమీ లేవు. కానీ ఆటతీరు మరీ తీసి పడేంత లేదు. ఇప్పటివరకు కోహ్లీ అక్కడ కేవలం మూడు టీ20లు మాత్రమే ఆడాడు. 141 స్ట్రైక్రేట్తో మొత్తం 112 పరుగులు సాధించాడు. ఇక్కడ బ్యాటర్లకు ఎంత అనుకూలంగా ఉంటుందో, స్పిన్నర్లకు అంతే సహకారం లభిస్తుంది. విరాట్ లక్ష్యంగా ప్రత్యర్థి జట్లు స్పిన్ తో ఎటాక్ చేసే అవకాశాలు లేకపోలేదు. అఫ్గాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లలో టాప్ క్లాస్ స్పిన్ బౌలర్లు ఉన్నారు. కాస్త సహనంతో వారిని ఎదుర్కొంటే కోహ్లీదే ఆధిపత్యం కావడం ఖాయం.
నమ్మకాన్ని నిలబెడతాడా?
‘‘కోహ్లీ ఫామ్పై సందేహాలు అక్కర్లేదు. కాస్త సహనంగా క్రీజ్లో నిలబడితే చాలు, ప్రత్యర్థి బౌలర్లే గతి తప్పుతారు. అలవోకగా పరుగులు రాబడతాడు’ అని గవాస్కర్ పేర్కొంటున్నారు. అయితే కోహ్లీపై ఇప్పుడేమీ ఒత్తిడి లేదు. ఇన్నింగ్స్ను నెమ్మదిగా ఆరంభించి పీక్ స్టేజ్కు తీసుకెళ్లగల సత్తా కోహ్లీ సొంతం. సూపర్-8 పోరులోనైనా కోహ్లీ బ్యాట్ను ఝళిపించాలని అభిమానుల ఆకాంక్షిస్తున్నారు.