Telangana : ప్రియురాలితో గొడవపడిన ఓ యువకుడు ఆమెతో ఫోన్ లో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూర్ కు చెందిన ఇమ్రోజ్ పటేల్ (29) కొన్ని సంవత్సరాలుగా రాజేంద్రనగర్ లోని పరమారెడ్డి హిల్స్ లో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పనిచేస్తున్న ఆయన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఆ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ యువతి ఇమ్రోజ్ ను దూరం పెట్టింది. ఈక్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఇమ్రోజ్ పటేల్ మంగళవారం రాత్రి తాను నివసించే ప్లాట్ నుంచి ఆ యువతికి ఫోన్ చేశాడు.
కొంతసేపు మాట్లాడిన అతను తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రియురాలికి చెప్పాడు. వెంటనే ఆమె అక్కడికి దగ్గరలో ఉండే మరో స్నేహితుడికి ఫోనులో విషయం చెప్పి ఇమ్రోజ్ పటేల్ ఫ్లాట్ కు వెళ్లాలని సూచించింది. ఆయన వెళ్లి చూడగా అప్పటికే ఇంట్లో దుప్పటితో ఉరి వేసుకొని ఇమ్రోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.