Hanuman Statue In USA : అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో 25 అడుగుల అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం త్వరలో నిర్మాణం కానుంది. మండ్రో టౌన్ షిప్ లో గల శ్రీ సాయి బాలాజీ క్షేత్రంలో ఈ విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వెంకటేశ్వర స్వామి క్షేత్ర ఆలయ చైర్మన్, ఫౌండర్ సూర్యనారాయణ మద్దుల, కో ఫౌండర్ రమేష్, కో ఫౌండర్ రామకృష్ణ పర్యవేక్షణలో విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. నవరత్నాలు, నవధాన్యాలు, పంచామృగాలు పంచలోహాలతో అత్యంత వైభవంగా ఈ భూమి పూజ కార్యక్రమం జరిగింది.
భారతదేశంలో మాదిరిగానే భక్తుల కోసం అమెరికాలోని న్యూ జెర్సీలో ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఆరుబయటే విగ్రహం ఉండాలని మొదటగా నిర్ణయించుకున్నారు. కానీ అమెరికాలో 6 నెలల పాటు మంచు కురిసే అవకాశం ఉండడంతో విగ్రహానికి గ్లాస్ తో పై కప్పు నిర్మించనున్నారు. ఈ విగ్రహ నిర్మాణానికి మద్దుల సూర్యనారాయణ పౌండర్, చైర్మన్ గా ఉండగా రామకృష్ణ రమేష్ కో ఫౌండర్లుగా ఉన్నారు.
ఈ సందర్భంగా ఫౌండర్ సూర్యనారాయణ మాట్లాడుతూ మొదటి దఫాగా 40000 చదరపు అడుగుల్లో ఇక్కడ సాయి జ్ఞాన మందిరాన్ని ఇదివరకే నిర్మించామని అన్నారు. జూన్ 2022న ప్రారంభించామని తెలిపారు. రెండో దఫాగా 25 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. అమెరికా వచ్చే భారతీయ సందర్శకులు, అమెరికాలో ఉండేవారు తప్పక ఈ క్షేత్రాన్ని సందర్శించాలని ఆయన కోరారు.
ఈ విగ్రహ నిర్మాణ భూమి పూజకు ప్రధాన అర్చకులుగా కృష్ణశాస్త్రి హాజరై శాస్రోప్తంగా పూజలు నిర్వహించారు. పూజారులు విజయ్ కుమార్, ఉమామహేశ్వర్ హోమం నిర్వహించారు. దాదాపు 250 మంది దంపతులు, 750 మంది భక్తులు హాజరు అయ్యారు. ఫౌండర్ సూర్యనారాయణ సతీమణి ప్రభావతి, కో ఫౌండర్ రామకృష్ణ సతీమణి లలిత, మరో కోపౌండర్ రమేష్ సతీమణి వాణి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మూడు నెలలుగా ఈ విగ్రహ నిర్మాణ కోసం వారు శ్రమిస్తున్నారు. వేడుకల్లో ట్రస్టీ శ్రీనివాస్, శివకుమార్ చికినే పాల్గొన్నారు.