
CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు తొలిసారి వచ్చారు. కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు.
‘‘ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని వచ్చాను. ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారు. వారందరికీ ధన్యవాదాలు. ఎన్టీఆర్ అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఆయన. తెలంగాణలో అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీ వదల్లేదు. పార్టీ నుంచి నాయకులు తప్ప కార్యకర్తలు వెళ్లలేదు. తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుంది. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని మళ్లీ అధికారంలోకి వచ్చాం. నన్ను జైల్లో పెట్టినప్పుడు టీడీపీ శ్రేణులు చూపించి చొరవ మరువలేను. ప్రపంచంలోని చాలా దేశాల్లో నా అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. హైదరాబాద్ లో నాకు మద్దతుగా నిర్వహించిన ఆందోళనలను టీవీలో చూసి గర్వపడ్డా’’ అని చంద్రబాబు అన్నారు.