- కొంత కాలంగా నోరు మెదపని సైకిల్ పార్టీ
- ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మక అడుగులా..?
TDP is silent on Amaravati : అమరావతి తమ రాజధాని అని నిన్న మొన్నటి వరకు హోరెత్తించిన టీడీపీ నేతలు కొంత కాలంగా సైలెంట్ అయ్యారు. రైతుల ఆందోళనలకు బాహాటంగా మద్దతునిచ్చిన ఆ పార్టీ కొన్ని రోజులుగా ఆ పదాన్నే ఉచ్చరించడం లేదు. దీని వెనుక రాజకీయ చతురత కలిగిన చంద్రబాబు వ్యూహాత్మక మౌనం ఏంటో తెలియక టీడీపీ శ్రేణులు తికమక పడుతున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా, అమరావతి అంశం కొంత పక్కకు పెట్టాలనే ఆలోచనలో పార్టీ ఆధిష్ఠానం భావిస్తున్నదనే ప్రచారం వినిపిస్తున్నది.
అమరావతి.. అపవాదు రాష్ర్టంలో ఎన్నో ప్రాంతాలు ఉండగా, అమరావతిపైనే గతంలో టీడీపీ దృష్టి పెట్టింది. రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అడుగులు వేసింది. ఐదు కోట్ల ప్రజల కలల రాజధానిలా కడుతామని ఢంకా బజాయించి మరి చెప్పింది. ఇందుకోసం ఎన్నో ప్రణాళికలు రూపొందించింది. తమ పార్టీ శ్రేణులు, అనుయాయులకు లబ్ధి చేకూరేలా అమరావతి నిర్ణయం జరిగిందని నాటి ప్రతిపక్షం ఆరోపించినా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అక్కడే కథ అడ్డం తిరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో కథ కంచికి చేరింది.
అమరావతిలో వైసీపీ మార్క్ రాజకీయం
కాగా అమరావతిలో భూములను పేదలకు పట్టాలు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవడంతో టీడీపీ రాజకీయాన్ని మొదలుపెట్టింది. రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేలా చేసి స్టే తెచ్చింది. కానీ హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఇక పంచాయతీ ఢిల్లీకి చేరింది. ప్రస్తుతం పట్టాల అంశం సుప్రీం కోర్టుకు చేరింది. త్వరలోనే విచారణ జరుగనుంది. కాగా, పేదలకు ఇండ్లను అడ్డుకుంటున్నదనే అపవాదును టీడీపీపై వేసింది వైసీపీ. దీనిని తిప్పకొట్టడంలో టీడీపీ అధిష్ఠానం విఫలమైంది. ఈ విషయంలో టీడీపీ కలుగజేసుకోవడం లేదు. ప్రస్తుతం ఈ విషయంలో కలుగజేసుకుంటే మొదటికే ముప్పు వస్తుందని భావిస్తున్నది. అందుకే అచితూచి వ్యవహరిస్తున్నది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అమరావతి అంశంపై ప్రస్తుతం తెరచాటు రాజకీయాలు చేస్తున్నదని, బహిరంగంగా మాట్లాడడం లేదనే ప్రచారం వినిపిస్తున్నది.