
Ten years of Telangana : 58 సంవత్సరాలు తెలంగాణ కన్న కల ఈ రోజు (2 జూన్, 2014)న నిజమైంది. ఏళ్ల పాటు వివక్షకు గురైన ప్రాంతం ఆ రోజుతో కొత్తగా ఊపిరిపోసుకుంది. ఈ రోజు (జూన్ 2) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ నాటికి తెలంగాణ సొంత రాష్ట్రంగా ఏర్పడి పది సంవత్సరాలు (దశాబ్దం). ఎంతో మంది అమరుల త్యాగఫలమే ప్రత్యేక రాష్ట్రం. నీరు, నిధులు, నియామకాల కోసం దాదాపు ఆరు దశాబ్దాల కొట్లాట ఫలితమే ప్రత్యేక రాష్ట్రం. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పోరాటాన్ని ఆసాంతం పరిశీలిద్దాం.
అభివృద్ధి పథంలో తలఎత్తుకొని నిలిచింది ఈ నేల. పదేళ్ల కాలంలో అభివృద్ధిలో మరింత దూసుకెళ్లింది. ఉద్యమ నేత కేసీఆరే కొత్త రాష్ట్ర పాలనా పగ్గాలు అందుకున్నారు. వరుసగా రెండు సార్లు సీఎం పీటంపై అధిరోహించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ముందుకు నడిపేందుకు శాయశక్తులా కృషి చేశారు. ప్రత్యేక రాష్ట్ర నినాదం ఎలా పుట్టింది..? ఉద్యమం ఎలా ప్రారంభమైంది..? పదేళ్లలో రాష్ట్రం ఎటు వైపు పయనించింది..? అభివృద్ధి ఎలా ఉంది..? కొత్త రాష్ట్రంలో విస్మరించిన అంశాలేంటి..? ఇక్కడ చూద్దాం.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రా ప్రాంతం వేరుపడింది. ఆ సమయంలో తెలంగాణ ప్రాంతం ఆంధ్రాతో కలువడాన్ని ససేమీరా అంది. కానీ అప్పటి పెద్దలు తెలంగాణ విన్నపాలను పట్టించుకోలేదు. బలవంతంగా ఆంధ్రాతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నీళ్లు,నిధులు,నియామకాల్లో తెలంగాణ వెనుకబడుతూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు భారీ బడ్జెట్ సమకూరుస్తున్న ప్రాంతం రాజకీయంగా, పలు విషయాలలో ఎప్పుడూ వెనుకబడుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో 1969లో తొలిదశ ఉద్యమం తారా స్థాయికి చేరింది. ఓయూలో విద్యార్థుల పోరాటాలు, సూసైడ్ లతో పీక్ కు వెళ్లింది. కానీ ఆంధ్రా ప్రాంతం వాటిని తొక్కిపడేసింది. ఆ తర్వాత చాలా కాలానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ నినాదాన్ని మరోసారి వినిపించారు. దీంతో అప్పుడు డిప్యూటీ స్పీకర్ గా పని చేస్తున్న కేసీఆర్ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తన పదవికి (21 ఏప్రిల్, 2001) రాజీనామా చేశారు. అదే మలి దశ ఉద్యమానికి అంకురార్పణ అయ్యింది.
అదే సంవత్సరం (2001), అదే నెల(ఏప్పిల్) 27న ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పార్టీ పురుడుపోసుకుంది. 2004లో కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. ఈ కారణంగానే తెలంగాణ జాతీయ ఎజెండాగా మారింది. ప్రత్యేక రాష్ట్రం కోసం 2009, నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు కూర్చున్నారు. ఆయనకు తెలంగాణ సమాజం మద్దతు పలికింది. నవంబర్ 29న ఉద్యమం తారా స్థాయికి వెళ్లింది. కేసీఆర్ నిమ్స్లో దీక్ష కొనసాగించడంతో.. డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. దీంతో కేసీఆర్ దీక్ష విరమించారు. ఆ బిల్లు పెట్టడం, పాస్ కావడం అంతా జరిగిపోయాయి.
ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ ఆ తర్వాత రాష్ట్ర పాలనా పగ్గాలు కూడా అందుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో సాధించుకున్న ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సంకల్పం తీసుకున్నాడు. కాలేశ్వరం కట్టాడు. మల్లన్నసాగర్, రంగనాయకమ్మ సాగర్, కొండ పోచమ్మ, గౌరవెల్లి, తపాస్ పల్లి, తోటపల్లి, సింగూరు, హల్దీ వాగులతో రాష్ట్రాన్ని సస్య శ్యామలం చేశాడు. అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపారు.






