
కర్ణాటకలోని ఏపీ సీమాంధ్ర బార్డర్ కాంగ్రెస్ కు కంచుకోట. ఇప్పటి వరకూ ఇక్కడ తమ ఉనికి చెక్కు చెదరకుండా కాంగ్రెస్ కాపాడుకుంటూ వస్తుంది. అయితే ఈ సారి కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందన్న సంకేతాలు రావడంతో ఇందులో కీలక భూమిక పోషించే ప్రాంతాలు ఇవే కావడం విశేషం.
బాగేపల్లి, గౌరీబిదనూరు, చిక్ బళాపూర్, శిడల్ గట్ట సరిహద్దుల్లోని నియోజకవర్గాలతో పాటు వీటిని ఆనుకొని కర్ణాటక వైపు ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఏళ్లుగా కాంగ్రెస్ హవా కొనసాగిస్తుంది. బంగార్పేట్, దేవనహళ్లి, కోలారు, దొడడ్ బళాపూర్, హోసకోట సీమ వైపు నుంచి కర్ణాటకలోని 40, 50 కిలో మీటర్ల పరిధిలో కూడా కాంగ్రెస్ సిట్టింగులున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి అభ్యర్థులు గెలుపొందే ఛాన్స్ ఉంది. బెంగళూర్ నార్త్లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. యలహంక అసెంబ్లీ నియోజకవర్గాన్ని మినహాయిస్తే మిగతా చోట్ల బీజేపీ వెనుకంజనే చెప్పుకోవాలి.
రాయలసీమతో, కర్ణాటక బార్డర్ పంచుకునే ప్రాంతం తుమకూరు. చిక్ బళాపూర్, కోలారు వైపు కర్ణాటకలో తెలుగు డామినేషన్ ఉంటుంది. ఇక తుమకూరుతో సరిహద్దును పంచుకునే తెలుగు ప్రాంతం మడకశిర వైపు కన్నడ డామినేషన్ ఎక్కువ. మడకశిర తెలుగు ప్రాంతమే అయినా ఇక్కడ ఎక్కువ మంది కన్నడ మాట్లాడుతారు. ఇక కన్నడ ప్రాంతమైన కోలారు, దేవనహళ్లి, దొడడ్ బళాపూర్, చిక్ బళాపూర్ అంతా తెలుగు వారు ఎక్కువ ఉంటారు.
కర్ణాటక రాజకీయాల్లో స్పష్టమైన విభజన..
హిందూపురం వైపు నుంచి కర్ణాటకలోకి ప్రవేశిస్తే అంతా తుమకూరు జిల్లా. అక్కడ కూడా బీజేపీ ప్రభావం అంతగా కనిపించదు. కాంగ్రెస్ లేకపోతే జేడీఎస్ ఎక్కువగా ఉంటుంది. ప్రధాన వైరం ఈ రెండు పార్టీల మధ్య ఉంటుంది. తుమకూరుతో మొదలుపెడితే.. పాత మైసూర్ రాష్ట్రంలో జేడీఎస్ హవా ఎక్కువ. మండయ్, మైసూర్ ప్రాంతంతో పాటు సకలేశ్పుర వరకూ జేడీఎస్ ఉంటుంది. ఇక్కడ బీజేపీ ఒక్క సీటు సాధించింది లేదు. గత ఎన్నికల్లో కూడా జేడీఎస్ 90 శాతం సీట్లు పాత మైసూర్ నుంచే గెలుస్తుంది. ఆ పార్టీ బలం రాను రాను తగ్గుతున్నా.. ఇప్పటికీ పట్టు నిలబెట్టుకుంది.
ఇక బీజేపీకి కోస్టల్ కర్ణాటక, మంగళూరు, ఉడిపిలో పట్టు ఉంది. అయితే ఇది మతపరంగా సెన్సిటివ్ ఏరియా కావడంతో బీజేపీకి కలిసి వస్తుంది. గత ఎన్నికల్లో ఈ ప్రాంతం అంతా బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సారి కూడా ఈ ప్రాంతాలపైనే ఆశలు పెట్టుకుంది. హిజాబ్ వ్యవహారం మొదలైంది మంగళూర్ ప్రాంతంలోనే. ఇక మంగళూర్ శివారు తర్వాత కేరళ రాష్ర్టం ప్రారంభమవుతుంది. అయితే కర్ణాటకలోని ఈ సరిహద్దు బీజేపీకి అనుకూలంగా ఉంటుంది.
కర్ణాటకకు రాజకీయ పరంగా స్పష్టమైన విభజన ఉంది. ఒక్కో ప్రదేశంలో ఒక్కో పార్టీ ఆధిపత్యం సాధిస్తాయి.
తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో కాంగ్రెస్, పాత మైసూర్ రాష్ట్రంలో జేడీఎస్, కోస్టల్ కర్ణాటక నుంచి లోపలి వైపునకు బీజేపీ. కోస్టల్ బెల్ట్తో సహా, ధార్వాడ్, మధ్య కర్ణాటక వరకూ బీజేపీని కాంగ్రెస్ ఓడించడం మీదే ఎన్నికల ఫలితాల్లో మార్పు ఆధారపడి ఉండవచ్చు. ఏ పార్టీకి పట్టున్న చోట ఆ పార్టీ నెగ్గితే.. హంగ్ తరహా ఫలితమే కావొచ్చు. ఎమ్మెల్యేల జంపింగుల మీద ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడవచ్చు!






