
Betting app scam : బెట్టింగ్ యాప్ చాటున జరుగుతున్న స్కాం ఒకటి బయటపడింది. ‘మహాదేవ్ బెట్టింగ్ యాప్’ ముసుగులో హవాలా మార్గంలో భారీగా సొమ్ము తరలుతున్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. రూ.417 కోట్ల విలువైన ఆస్తులను సదరు సంస్థ సీజ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి పలువురు బాలీవుడ్ తారల పేర్లు వినిపిస్తుండడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ యాప్ నిర్వాహకుల్లోని ఒకరి పెళ్లికి వీరు హాజరవ్వడమే దీనికి ప్రధాన కరాణంగా తెలుస్తోంది. దీంతో ఈడీ వారికి సమన్లు జారీ చేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
దుభాయ్ కేంద్రంగా సౌరభ్ చంద్రఖర్, రవి ఉప్పల్ ‘మహదేవ్ బెట్టింగ్ యాప్’ నిర్వహిస్తున్నారు. ఈ యాప్ ముసుగున మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ భారీ నెట్ వర్క్ తో సంబంధం ఉన్న భోపాల్, కోల్కతా, ముంబై వంటి నగరాల్లో ఈడీ సోదాలు చేసింది. మనీలాండరింగ్ కు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు సంపాదించింది. బెట్టింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని యాప్ షేర్ ఖాతాలకు మళ్లించేందుకు హవాలా మార్గం ఎంచుకున్నట్లు ఈడీ స్పష్టం చేసింది. యూజర్లను పెంచుకునేందుకు పెద్ద ఎత్తున యాడ్స్ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది.
వివాహానికి ₹200 కోట్లు
ఈ యాప్ ప్రమోటర్లలో ఒకరు సౌరభ్ చంద్రకర్ వివాహం ఫిబ్రవరి 2023లో జరిగింది. ఈ వివాహానికి దాదాపు రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. చాలా మంది బాలీవుడ్ సెటబ్రెటీలు కూడా ఈ వివాహానికి హాజరయ్యారని ఈడీ గుర్తించింది. టైగర్ ష్రాఫ్, నేహా కక్కర్, రహత్ ఫతేహ్ అలీ ఖాన్, సన్నీ లియోనీ, అతిఫ్ అస్లమ్, అలీ అస్గర్, విశాల్ దద్లానీ తదితరులు వచ్చారు. వీరి కోసం సౌరభ్ చంద్రకర్ ఒక ప్రైవేట్ జట్టు సైతం ఏర్పాటు చేసినట్లు మీడియా కథనాలు వెలువరించింది.
ఈ వివాహ వేడుకల కోసం ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి రూ.112 కోట్లు హావాలా రూపంలో చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. హోటల్ గదుల కోసమే రూ.42 కోట్లు వెచ్చించినట్లు తెలిసింది. ఆ తర్వాత మరో పాట్నర్ రవి ఉప్పల్ నిర్వహించిన ఒక పార్టీకి బాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చినట్లు తెలిసింది. హవాలా మార్గంలో వచ్చిన సొమ్మును బాలీవుడ్ సెలబ్రిటీలకు, ఈ వెంట్ మేజ్మెంట్ సంస్థలకు చెల్లించినట్లు ఈడీ కూపీ లాగింది.