
CS Nirabh Kumar : టీడీపీ గెలిచిన వేళా విశేషమో అమరావతి రైతులకు అన్నీ కలిసొస్తున్నాయి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే రాజధాని రైతులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తాము అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం తెలిసిందే. ఆయన అన్నట్టుగానే అధికారంలోకి రావడం, అమరావతిలో వివిధ పనులు చకాచకా జరుగుతుండడం గమనార్హం. ఈ మేరకు అమరావతిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ రాజధాని రైతులకు శుభవార్త చెప్పారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే రాజధాని పనులను ప్రారంభిస్తామని తెలిపారు. అమరావతి రైతులకు చెల్లించాల్సిన రెండేళ్ల కౌలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో ఆయన సీఆర్డీఏ అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన నిర్వహించారు. అయితే ఈనెల 12న కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానున్న నేపథ్యంలో సీఎస్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని ప్రాంతంలో పర్యటించిన సీఎస్.. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఎన్నికల ఫలితాలు ఏర్పడిన తర్వాత గత నాలుగైదు రోజులుగా రాజధాని ప్రాంతంలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. జేసీబీలు, టిప్పర్లు వంటి యంత్రాలతో రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో, సీడ్ యాక్సిస్ రహదారి, కరకట్ట రహదారి సహా ఇతర మాస్టర్ ప్లాన్ లోని ప్రధాన రహదారులు వెంబడి మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అలాగే ముళ్ల కంపలు తొలగించడం, విద్యుత్ దీపాల పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.
ఇదిలా ఉంటే 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంపై అమరావతి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. టీడీపీ అధికారంలో రావడంతో తమ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని..తమ ప్రాంతానికి అద్భుత భవిష్యత్ ఉండబోతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.