
Mudragada : ఈ సారి ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఎందరికో గుణపాఠం నేర్పించాయి. మరెందరికో కనువిప్పి కల్పించాయి. కొందరు మీసాలు తీసేసుకుంటే.. మరికొందరు రాజకీయ సన్యాసం తీసుకునేలా చేశాయి. జగన్ పోకడలు, నిర్ణయాలు, ఆలోచనలు, విధానాలు సరికావని రాష్ట్రానికే కాదు యావత్ దేశానికి తెలిపాయి. ప్రజలను లైట్ తీసుకుంటే ఏమవుతుందో చూపెట్టాయి. ప్రభుత్వాలను ప్రజలు కాదు మార్చేది మా వంటివారే మారుస్తారని అహంతో విర్రవీగే వారికి కనువిప్పు కలిగించేలా చేశాయి.
ఈ జాబితాలో ఒక పెద్దయన కూడా ఉన్నారు ఆయనే ముద్రగడ పద్మనాభం. పవన్ కళ్యాణ్ను విభేదించాలనే ఆయన వైసీపీలో చేరారు తప్ప మరే బలమైన కారణం లేదు. కానీ ఆ నిర్ణయం తప్పని దీనితో తానే నష్టపోయానని, ఈ పాటికి గ్రహించే ఉంటారు.
జగన్ బలం చూసుకొని ముద్రగడ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ని ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా తాను కనుసైగ చేస్తే చాలు.. రాష్ట్రంలో కాపు సామాజికవర్గం తన వెంట వస్తుందని, తను సూచించినవారికే ఓటు వేసి గెలిపించేస్తుందనే భ్రమలో ఉన్నారు.
బహుశ ఆ గుడ్డి నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని శపథం చేసేశారు. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచి, డిప్యూటీ సీఎం పదవితో సహా కీలక శాఖల బాధ్యతలు చేపట్టారు. ఇది కాపు సామాజిక వర్గానికి గర్వ కారణమే కదా?
ఇక, ముద్రగడ శపథం చేసినందున మార్చుకోక తప్పలేదు. చట్ట ప్రకారం పేరు మార్పునకు ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం కూడా ఆలస్యం చేయకుండా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాపుగా వద్దనుకొని రెడ్డిగా మారిపోయారు కనుక ఇప్పుడు ఆయన ఏ కులానికి చెందుతారో.. ఏ వర్గం వారితో మమేకం అవుతారో ఆయనే నిర్ణయించుకోవాలి. ఆయనను ఏ కులం తమతో కలుపుకుంటుందో చూడాలి.
కాపులకు అధికారంలో భాగస్వామ్యం లభించబోతున్న సమయంలో ఆయన పవన్ కళ్యాణ్కు అండగా ఉండి ఉంటే ఆయనకు గౌరవం దక్కేది. పదవులు లేకపోయినా కాపులకు తనవంతు మేలు చేశారనే గుర్తింపు వచ్చేది. రాజకీయాల్లో తన చివరి అధ్యాయం హుందాగా, గౌరవంగా ముగించగలిగి ఉండేవారు. కానీ చేజేతులా తన ‘పేరు’ తనే పాడుచేసుకొని అవమానకరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ స్థాయి నాయకుడికి ఇటువంటి ముగింపు బాధాకరమే. చెడు సహ వాసానికి ఆనాడు కురు వృద్ధుడు (భీష్ముడు) కూడా మూల్యం చెల్లించక తప్పలేదు కదా?