
ప్రస్తుతం ఇండియాలో కొనసాగుతున్న ప్రీమియర్ లీగ్ -2023 ముగిసిన వెంటనే ఇండియా క్రికెట్ జట్టు ఇంగ్లండ్ టూర్ కు వెళ్లనుంది. జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు ఇంగ్లాండ్ లోని ఓవల్ లో ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆడుతుంది. అయితే ఈ మెగా ఫైట్ కు వెళ్లబోయే ముందు టీమిండియాలోని ఆటగాళ్లు గాయాలతో సతమతం అవుతున్నారు.
ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియా హాట్ ఫెవరేట్. ఇందులో వరుసగా రెండు సార్లు భారత్ ఫైనల్ వరకూ వెళ్లింది. అయితే ఇందులో గతేడాది న్యూజిలాండ్ తో ఆడి ఓడిపోయి రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ దఫా ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టుతో తాడోపేడో తెల్చుకోనుంది. అయితే ఇప్పటికే జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఇందులో కేఎల్ రాహుల్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్ గాయాలతో బాధపడుతున్నారు. వీరిలో ప్రతి ఒక్కరి స్థానంలో మరో స్టార్ ఆటగాడు రీప్లేస్ లో ఉన్నాడు. ఇది కొంత టీమిండయాకు కలిసి వచ్చే అంశమనే చెప్పాలి.
ప్రారంభ టెస్ట్ మ్యాచ్ లోనే అంతగా ప్రతిభ చూపని సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే ఇంగ్లండ్ టూర్ లో సూర్యకుమార్ యాదవ్ ను సెలక్టర్లు చేర్చలేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడిన టెస్ట్ లో ఆయన పేలవమైన ప్రదర్శన చూపడంతో సెలక్టర్లు ఆయనను పక్కన పెట్టారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ లో సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ గాయాలతో ఆస్ట్రేలియాతో టెస్ట్ ఛాంపియన్ షిప్ కు దూరమైతే ఆ స్థానంలో సూర్య కుమార్ యాదవ్ ను పంపించే అవకాశం ఉంది. ఇప్పటికే సూర్య టీ-20లో వరల్డ్ నెం. 1 అన్న విషయం తెలిసిందే.






