- గెలవాలంటే కలవాల్సిందేనా..
The Three Parties : ఏపీలో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీల్లో కదలికలు కనిపిస్తున్నాయి. అధికార వైసీపీ కూడా తమ ప్రత్యర్థి చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఇబ్బందులు పెట్టేందుకు సిద్ధమవుతన్నదా అంటే అవుననే సమాధానం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నది. ఇదిలా ఉంటే ఏపీలో కీలక పొత్తులకు టీడీపీ, జనసేన, బీజేపీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నది. బీజేపీ నేరుగా ఎలాంటి ప్రకటన చేయకున్నా, మిగతా రెండు పార్టీలు మాత్రం తమ మైత్రి బంధంపై బహిరంగంగానే ప్రకటనలు ఇచ్చాయి.
టీడీపీపై బీజేపీ మెతక వైఖరి..
అయితే టీడీపీ అంటేనే విరుచుకుపడే నేతల్లో కొందరు రాష్ర్ట బీజేపీ నేతలు ముందుండే వారు. వారిలో జీవీఎల్ కూడా ఒకరు. అయితే ఆయన శైలికి భిన్నంగా టీడీపీతో పొత్తులపై ఆదివారం స్పందించారు. జనసేనతో మాత్రమే తమ పొత్తు ఉందని గతంలో ప్రకటించిన బీజేపీ నాయకులు, ఇప్పుడు టీడీపీతో పొత్తు అంశంపై పవన్ నేరుగా మాట్లాడడని స్వాగతిస్తున్నారు. తాము కూడా ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానమే తీసుకుంటుందని చెబుతున్నారు. టీడీపీ మీద ఎలాంటి అంశం మాట్లాడకుండా, వైసీపీని విమర్శిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని పెద్దలకు జీవీఎల్ సన్నిహితులుగా ఉంటారని, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయన టీడీపీపై నోరుమెదపలేదని కొందరు భావిస్తున్నారు.
రానున్న ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే మాత్రం ఇక వైసీపీ పూర్తిగా దెబ్బతింటుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. జగన్ కూడా ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తు్న్నారని, తమ వైపు ప్రజలున్నారని వైసీపీ చెప్పుకుంటున్నది. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలే తమను మరోసారి అధికారంలోకి తెస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడు పార్టీలు కలిస్తే మాత్రం వైసీపీ కి ముచ్చెముటలు తప్పేలా లేవు. రాజధాని అంశం కూడా త్వరగా తేల్చకపోతే వైసీపీ మరింత తీవ్రంగా నష్టపోయే అవకాశముందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాలి.
అప్పటివరకు ఈ మూడు పార్టీల మధ్య సీట్ల పంపకం, ఇతర విషయాల్లో ఏకాభిప్రాయం కుదిరితేనే పొత్తు నిలబడే అవకాశం ఉంటుంది. ఏ ఒక్కరూ పట్టుకు పోయినా ఇబ్బందికర పరిస్థుతులే ఎదురవుతాయి. మరి వీరి పొత్తు అంశం ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుందన్న మాట.