
AP Politics : ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లు అధికారానికి దూరమైన టీడీపీ అంతే బలంగా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. మరి కొద్ది రోజుల్లో ఏపీలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది. భారీ మెజార్టీతో గెలుపొందిన కూటమి కీలక నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మంత్రివర్గం కూర్పు పైనా కసరత్తు చేస్తున్నారు. ఇక కొత్త ప్రభుత్వంలో పవన్ కల్యాణ్, లోకేష్ కీలక బాధ్యతలు తీసుకుంటారని ప్రచారా జరిగింది. కానీ వ్యూహం మార్చినట్లు తెలుస్తున్నది. పవన్ కల్యాణ్..లోకేష్ పాత్ర ఏమిటనే అంశంపై ఆసక్తి నెలకొంది.
చంద్రబాబు కసరత్తు
కొత్త ప్రభత్వం ఏర్పాటుకు చంద్రబాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. సీఎంగా చంద్రబాబు తో పాటుగా కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి మంత్రులుగా ఎవరెవరికీ అవకాశం ఇవ్వాలనే అంశంపైనా ముఖ్యనేతలు ఇప్పటికే చర్చలు జరిపారు. దాదాపు 25 మంది మంత్రి వర్గంలో ఉండే అవకాశం ఉందని తెలుస్తున్నది. టీడీపీ నుంచి చంద్రబాబుతో సహా 20 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరికి మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం సాగినా ఇప్పుడు వ్యూహం మార్చినట్లు తెలుస్తున్నది. మంత్రివర్గంలో ఇప్పుడే చేరొద్దనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తున్నది.
పవన్ కీలక పాత్ర
పవన్ కల్యాణ్ మంత్రిగా ఉండే కన్నా, పార్టీ అధినేతగానే ప్రభుత్వానికి తన వంతు సహకారం అందిస్తూ..ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో కీలకంగా వ్యవహరించాలనే భావనలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే పవన్ తన తుది నిర్ణయం ఏమిటనేది రేపోమాపో వెల్లడి కానుంది. లోకేష్ పాత్ర పైనా టీడీపీలో చర్చ జరుగుతున్నది. చంద్రబాబు సీఎంగా ఉండడంతో, లోకేష్ పార్టీ వ్యవహారాల పై దృష్టి సారించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. గతంలో అధికారంలో ఉన్న సమయంలో లోకేష్ పార్టీ కేడర్ ను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తుండడంతో పార్టీ కేడర్ కు లోకేష్ అందుబాటులో ఉండి, పార్టీ – ప్రభుత్వం మధ్య సంధానకర్తగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారని టాక్.