
Deputy CM Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన 175 మంది శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ వారితో ప్రమాణం చేయిస్తున్నారు. ప్రొటెం స్పీకర్గా రాజమండ్రి రూరల్కు చెందిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికైన విషయం తెలిసిందే. ప్రొటెం స్పీకర్గా ఆయన గురువారం సాయంత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణం చేయించారు. పార్టీలకు అతీతంగా అసెంబ్లీలో అందరికంటే సీనియర్ అయిన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తుంది. శాసన సభలో టీడీపీకి 134 మంది సభ్యుల బలం ఉంది. జనసేన- 21, బీజేపీ-8మంది సభ్యులు ఉన్నారు. వైసీపీ 11 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదా కోల్పోయింది. వారందరూ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణం చేస్తారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్.. ఈ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. వారిద్దరూ కూడా తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వారు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో నారా లోకేష్ ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యారు. పార్టీ పెట్టిన పదేళ్ల తరువాత అసెంబ్లీలో అడుగు పెట్టబోతోన్నారు పవన్ కళ్యాణ్. అది కూడా డిప్యూటీ సీఎం హోదాలో. 2014 మార్చి 10న జనసేన ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అప్పటి ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు గానీ ఎన్నికల బరిలో డైరెక్టుగా నిలబడలేదు.
సీపీఐ, సీపీఎం, బహుజన్ సమాజ్వాది పార్టీలతో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నికల్లో పోటీ చేశారు గానీ ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే దక్కించుకోగలిగింది జనసేన. రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ మాత్రమే గెలిచారు. పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోయారు. అయిదేళ్లు తిరిగే సరికి పవన్ ప్రభంజనం కనిపించింది. టీడీపీ- బీజేపీతో కలిసి బరిలోకి దిగారు. పోటీ చేసిన 21 స్థానాల్లో తిరుగులేని మెజార్టీతో తన అభ్యర్థులను గెలిపించుకోగలిగారు. 70 వేలకు పైగా భారీ మెజార్టీతో పిఠాపురంలో విజయఢంకా మోగించారు. తొలిసారే ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. పవన్ కల్యాణ్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమంటూ గతంలో వైసీపీ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. అవేవీ ఆయన విజయాలను అడ్డుకోలేకపోయాయి. ఆయనను హెచ్చరించిన నాయకులు సైతం ఘోరంగా ఓడిపోయారు. ఎన్నో అవమానాలు, అడ్డంకులను దాటుకుని పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. దీంతో ఆ పార్టీ క్యాడర్ లో జోష్ నిండింది.