
Stole gold : సికింద్రాబాద్ బంగారం చోరీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి ఆరు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు సంబంధించిన వివరాలు తెలుసుకోవడంతో వారు షాక్ కు గురయ్యారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చోరీకి సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు.
సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ లోని ఒక బంగారం దుకాణంలో ఈ నెల (మే) 27న చోరీ జరిగింది. ఇందులో విచిత్రం ఏంటంటే పూర్తిగా సినిమా స్టయిల్ లో దొంగతనం జరిగింది. మొదట ఇన్ కంట్యాక్స్ ఆఫీసర్స్ అంటూ ఒకరి తర్వాత ఒకరు మొత్తం 10 మంది దుకాణంలోకి ప్రవేశించారు. మోండా మార్కెట్ అంత రద్దీగా ఉన్నా, పక్కాగా రెక్కీ నిర్వహించి మరీ వీళ్లు ప్లాన్ ను అమల్లోకి తెచ్చారు.
గోల్డ్ బైయింగ్ అండ్ సెల్లింగ్ లో డిఫరెంట్ కనిపిస్తుందని, షాపును సీజ్ చేస్తామని భయపెట్టారు. 1700 గ్రాములకు ఎలాంటి రశీదు గానీ, ట్యాక్సులు గానీ లేవని ఆ బంగారాన్ని తీసుకెళ్లిపోయారు. వెళ్తూ, వెళ్తూ బయట నుంచి షెటర్ కూడా వేశారు. దీంతో కాసేపు షాక్ కు గురైన యజమాని మెల్లగా తేరుకొని సమీపంలోని షాపు వారికి ఫోన్ చేశాడు. వారు షెటర్ తెరవడంతో బయటపడ్డారు. స్థానికులతో మాట్లాడిన తర్వాత తాము మోసపోయామని యజమాని గ్రహించాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల దర్యాప్తులో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఇంకా కొన్ని ఆధారాలను సేకరించి దర్యాప్తు మొదలు పెట్టారు. అప్పటికే నేరస్తులు మహారాష్ట్రకు పారిపోయి ఉంటారని గుర్తించారు. కొంత మంది పోలీసులను టీములుగా విభజించి మహారాష్ట్రకు పంపించారు.
ఎలాగోలా చివరికి జాకీర్, ప్రవీణ్, రహీమ్, అక్షయ్ ని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఉన్న మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. వీరి నుంచి పోలీసులు కొంత బంగారం రికవరీ చేశారు. వీరు స్పెషల్ ఛబ్బీస్, గ్యాంగ్ సినిమాలు చూసి ఈ దోపిడీకి స్కెచ్ వేసినట్లు చెప్పారని సీపీ వివరించాడు. మిగతా వారిని కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పారు.






