
Telangana Budget : నేడు తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ను మంత్రి భట్టి విక్కమార్క మల్లు ప్రవేశ పెట్టనున్నారు. సంక్షేమం, అభివృద్ధి రంగాలకే బడ్జెట్లో ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల అమలుకు రూ.50 వేల కోట్లకు పైగా దక్కే అవకాశాలున్నాయి. బడ్జెట్ రూ.2.80 లక్షల కోట్ల నుంచి రూ.2.90 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. గురువారం ఉదయం 9 గంటలకు జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మొత్తం ఎంతనేది ఖరారు కానుంది. మంత్రివర్గం ఆమోదించిన అనంతరం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. శాసనమండలిలో ఈ బాధ్యతను మంత్రి శ్రీధర్బాబు నిర్వహిస్తారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ.2.75 లక్షల కోట్లు. రెండు రోజుల క్రితం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించనందున దాని ప్రభావం రాష్ట్ర బడ్జెట్ పై పడనున్నట్లు తెలుస్తోంది. గతేడాది(2023-24) రాష్ట్ర బడ్జెట్లో కేంద్రం ఇచ్చే గ్రాంట్ల కింద రూ.41,259 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా రూ.13,953 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది(2024-25) రూ.21,075 కోట్లు వస్తాయని ఓటాన్ ఎకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినా ఏప్రిల్ నుంచి జూన్ వరకూ మొదటి త్రైమాసికంలో రూపాయి కూడా రాలేదు.
ఇదిలా ఉంటే బడ్జెట్లో రుణమాఫీకి రూ.30 వేల కోట్లు, రైతుభరోసాకు రూ.15 వేల కోట్లతో కలిపి వ్యవసాయ శాఖకే అత్యధికంగా దాదాపు రూ.50 వేల కోట్ల వరకూ కేటాయింపులుంటాయని సమాచారం. సంక్షేమ శాఖలన్నింటికీ కలిపి రూ.40 వేల కోట్లు, సాగునీటిపారుదలకు రూ.29 వేల కోట్లు, వైద్యశాఖకు రూ.15 వేల కోట్లు, విద్యుత్శాఖకు రూ.15 వేల కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల నిమిత్తం గృహ నిర్మాణశాఖకు రూ.8 వేల కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. గతేడాది మొత్తం బడ్జెట్ను రూ.2.90 లక్షల కోట్లుగా చూపినా చివరికి ఆదాయం రూ.2.18 లక్షల కోట్లే వచ్చినట్లు కాగ్ నివేదికలో తెలిపింది.
ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రూ.49,625 కోట్ల రుణాలు ఉన్నాయి. అలాగే రూ.2.19 లక్షల కోట్లలోపే మొత్తం వ్యయం ఉన్నట్లు తెలిపింది. బడ్జెట్లో పేర్కొన్నదాని కంటే రూ.71 వేల వ్యయం తక్కువగా ఉండటం ఏంటని, అంత ఆదాయం లేనప్పుడు బోగస్ ఆదాయ అంచనాలు ఎందుకని ప్రస్తుత ప్రభుత్వం ఆర్థికశాఖను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను పోయినేడాది కన్నా రూ.15 వేల కోట్లు తగ్గించి రూ.2.75 లక్షల కోట్లకే చూపారు. ఇప్పుడు కూడా వాస్తవికతకు దగ్గరగా బడ్జెట్ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికశాఖను ఆదేశించింది.