
Group-1 Exam : గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసి ఇంటికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ వివాహిత మృతి చెందింది. దీంతో వారి ఇంట్లో విషాదం నెలకొంది.
ఆదివారం తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో ఈ పరీక్షలను అధికారులు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం బోరబండ తండాకు చెందిన సుమిత్ర (28) పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తోంది. విధులు నిర్వహిస్తూనే గ్రూప్-1 పరీక్షకు ప్రిపేర్ అయింది. ఈ క్రమంలో ఆదివారం ఈ పరీక్షలకు హాజరైంది. అనంతరం తిరిగి ఇంటికి
భర్తతో కలిసి వెళ్తుండగా ధారూర్ మండలం దోర్నాల వద్దకు రాగానే అదుపు తప్పి కిందపడ్డారు.
ఈ ప్రమాదంలో సుమిత్రకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన సుమిత్రను వెంటనే తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త నెహ్రూ నాయక్ కు స్వల్ప గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రూప్-1 పరీక్ష రాసి ఆఫీసర్ అవుతుందని ఆశలు పెట్టుకుంటే తమకు కన్నీరు మిగుల్చిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.