
Pawan Kalyan-Sai Dharam Tej : పవన్ కల్యాణ్ చిరకాల కోరిక ఎమ్మెల్యే కావడం జరిగిపోయింది. పిఠాపురం ప్రజలు దాదాపు 70,259 ఓట్ల మెజార్టీతో గెలిపించి పవన్ ను అసెంబ్లీకి పంపించారు. పిఠాపురంలో అన్నీ తానై ప్రచారం చేసిన పవన్ కల్యాణ్ అల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ విజయంతో ఉద్వేగానికి లోనయ్యాడు. సాయి ధరమ్ తేజ్ పిఠాపురంలో ముందు నుంచి పవన్ కల్యాణ్ తరఫున ప్రచారంలో పాల్గొన్నాడు. రోజూ ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచారం చేశాడు. పవన్ కల్యాణ్ ను గెలిపించాలని కాళ్లకు బలపం కట్టుకుని తిరిగాడు.
పవన్ కల్యాణ్ ను గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి కూడా ఓటింగ్ ముందు ప్రజలను కోరాడు. పవన్ ప్రజా సేవకే అంకితమయ్యాడు. ఈ సారి తప్పకుండా గెలిపించాలని కోరాడు. అదే స్థాయిలో పవన్ ను పిఠాపురం ప్రజలు ఆదరించారు. పవన్ కల్యాణ్ గెలవడంతో మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పవన్ హత్తుకుని ఏడ్చేశాడు. అనంతరం ఆయన్ని ఎత్తుకుని సంబరాల్లో మునిగిపోయాడు. పవన్ కూడా సాయి ధరమ్ తేజ్ ను చూసి నవ్వుతూ ఎంజాయ్ చేశాడు. ఇప్పడు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పవన్ కల్యాణ్ మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటాడని సాయి ధరమ్ తేజ్ ప్రచారంలో చెప్పాడు. పవన్ విజయంలో తేజ్ తో పాటు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కమెడియన్ ఆది, సుధీర్, పృథ్వీరాజ్ లాంటి వారు ఎంతో మంది నటీ నటులు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
పిఠాపురంలో తెలుగు దేశం పార్టీకి చెందిన వర్మ కూడా అదే స్థాయిలో కష్టపడ్డాడు. 30 ఏండ్ల రాజకీయ జీవితం ఉన్న వంగ గీతపై పోరాడి పవన్ ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో రెండు స్థానాల్లో కూడా ఓడిపోయి రాజకీయ జీవితమే ప్రశ్నార్థకం అయిన సమయంలో పవన్ కల్యాణ్ వెనుదిరిగి చూడకుండా ధైర్యంగా ముందుకు సాగడంతోనే నేడు ఇలాంటి మరుపురాని విజయాన్ని అందుకున్నాడు. అందుకే దీన్ని మామూలు విజయం కాదని అపూరమైనదిగా భావిస్తున్నారు.