
Uttarakhand : ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. ఉత్తరాఖండ్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. చమోలీ జిల్లాలో జరిగిన ఘటనలో ఇద్దరు హైదరాబాద్ కు చెందిన యాత్రికులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కర్ణప్రయాగ, గౌచర్ మధ్యలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ కు చెందిన నిర్మల్ షాహీ (36), సత్యనారాయణ (50) బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకొని బైక్ పై తిరిగివస్తుండగా మార్గమధ్యంలో కొండచరియలు విరిగి వారిపై పడ్డాయి. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ లో ఉన్న ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి బద్రీనాథ్ నేషనల్ హైవే పలు చోట్ల ధ్వంసమై రాకపోకలు నిలిచాయి. రుద్రప్రయాగ్-కేదారినాథ్ జాతీయ రహదారిపై కూడా రాకపోకలు నిలిచాయి.