
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం చంద్రబాబుపై అసెంబ్లీలోనూ, బయటా తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసిన వారిలో వంశీ కూడా ఉన్నారనే విమర్శలున్నాయి. 2019లో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున గెలిచిన వంశీ ఆ తర్వాత వైసీపీ పంచన చేరి ఆ పార్టీ నేతలతో కలిసి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
కాగా, తాజా ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో వంశీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కొన్నాళ్లు విజయవాడలో, కొన్నాళ్లు గన్నవరంలో ఉన్నప్పటికీ.. గత రెండు మూడు రోజులుగా ఆయన కనిపించకుండా పోయారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 2021లో టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయాన్ని కొందరు వైసీపీ నేతలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసును తాజాగా సంకీర్ణ ప్రభుత్వం రీ ఓపెన్ చేసింది. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ చౌదరి సహా ఇతర నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వీరంతా ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం వారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలావుంటే.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీని 71వ నిందితుడిగా చేర్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వైసీపీ నేతలను కొందరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వంశీ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. రెండు రోజుల కిందటే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని ఫ్లాట్, గన్నవరంలోని నివాసానికి కూడా తాళం వేసినట్లు సమాచారం. వంశీ ఎక్కడికి వెళ్లాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.