
PM Modi : కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం గెలిచిందని, సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ మంత్రం గెలిచిందన్నారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయంలో మోదీ ప్రసంగించారు. జైజగన్నాథ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి, ఒడిశాలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నకున్నందుకు ఆ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒకే వ్యక్తి సారథ్యంలో వరుసగా మూడు పర్యాయాలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం 1962 తర్వాత ఇదే తొలిసారని మోదీ తెలిపారు. 2024 ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తూ.. ‘దేశ రాజ్యాంగమే మాకు దిశానిర్దేశం చేస్తుంది. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మలచడానికి అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తాం. ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీలు అధికారంలో ఉన్నాయన్న దాంతో సంబంధం లేకుండా ఈ కృషి కొనసాగిస్తాం. మరిన్ని భారీ నిర్ణయాలు కూడా ఉంటాయి’ అని మోదీ పేర్కొన్నారు.