
AP News : అర్ధరాత్రి పక్క ఊళ్లో పాలకోవా తినొద్దామని కారులో వెళ్లి, ప్రమాదానికి గురై నలుగురు స్నేహితులు మృతి చెందారు. రాత్రిపూట ఐదుగురు స్నేహితులు కలుసుకున్నారు. కారులో అర్ధరాత్రి వేళ.. పక్క ఊళ్లో పాలకోవా తినొద్దామని వెళ్లారు. తిరిగి వస్తూ ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రామాపురం మండల పరిధిలోని చిత్తూరు-కర్నూలు నేషనల్ హైవేపై చోటుచేసుకుంది.
వైఎస్సార్ జిల్లా కడపకు చెందిన పూజారి ఆంజనేయులు నాయక్, పఠాన్ అఫ్రోజ్ అలీఖాన్, ఎం.జితేంద్రకుమార్, షేక్ అలీం, షేక్ ఖాదర్ బాషా(19) స్నేహితులు. వీరంతో శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటలకు రామాపురం మండలంలోని గువ్వలచెరువులో పాలకోవా తినేందుకు కడప నుంచి కారులో వెళ్లారు. పాలకోవా తిని శనివారం తెల్లవారుజామున రామాపురం వెళ్లి జాతీయ రహదారి మీదుగా కడపకు బయల్దేరారు. కారు కొండవాండ్లపల్లి సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న ట్యాంకరును వేగంగా ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆంజనేయులు నాయక్ (28). పఠాన్ అఫ్రోజ్ అలీఖాన్ (26), జజితేంద్రకుమార్ (24), షేక్ అలీం (35) అక్కడికక్కడే మృతిచెందారు. ఖాదర్ బాషా తీవ్రంగా గాయపడగా పోలీసులు వచ్చి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదస్థలాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి పరిశీలించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింది మంత్రి సొంత నిధులు రూ.లక్ష అందించారు.