- ఆయన పార్టీలో టాక్ ఏంటి..?
Young Leader Nara Lokesh : నలభై ఏండ్ల రాజకీయ అనుభవం, సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం సహా గతంలో హైదరాబాద్ అభివృద్ధిలో తాను కీలక పాత్ర పోషించినట్లుగా చాలా మంది భావిస్తారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీని కాపాడుకునేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు. ఎన్ని అవమానాలు ఎదురైనా మామకు వెన్నుపోటు అనే ముద్ర పడినా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
తన దైన శైలి రాజకీయం, వ్యక్తిత్వంతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 70 ఏండ్లు దాటింది. ఎన్నో విజయాలు, అపజయాలు, ఆటుపోట్లను దీటుగా ఎదుర్కోన్న ఆయన పార్టీలో తన వారసుడికి కీలక స్థానం అప్పగించాలని భావించారు. గతంలో అధికారంలో ఉండగా, ఎమ్మెల్సీగా చేసి, ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టారు. 2019 ఎన్నికల్లో పార్టీతో పాటు కొడుకు లోకేశ్ కూడా ఎమ్మెల్యేగా గెలవకపోవడం ఇబ్బందికరంగా మారింది. దీనికి తోడు ప్రత్యర్థి శిబిరం లోకేశ్ పై పప్పు అంటూ ముద్ర వేసి, హేళన చేస్తూ వస్తున్నది. తండ్రి రాజకీయ చతురత లోకేశ్ లో ఏ మాత్రం లేదని ఇటు శ్రేణులు, ప్రజల్లోకి వెళ్లింది. ఒకనొక దశలో ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో లోకేశ్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తనను హేళన చేసే వారికి జవాబు చెప్పే పనిలోకి దిగాడు..
యువగళంతో మైలేజీ పెరిగిందా..?
టీడీపీలో జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో లోకేశ్ కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చే ఉద్దేశంతో ప్రస్తుతం ఆయన యువగళం పేరిట పాదయాత్ర మొదలుపెట్టారు. ఏడాది పాటు సాగే ఈ పాదయాత్రలో 4000 కిలోమీటర్లు ఆయన నడవనున్నారు. సామాన్యుల బాధలను స్వయంగాతెలుసుకుంటూ పార్టీ భవిష్యత్లో చేపట్టే పనులను వివరిస్తున్నారు. దీంతో పాటు గతంలో టీడీపీ చేసిన పనులు, ప్రస్తుతం వైసీపీ పాలనను వివరిస్తూ ముందుకెళ్తున్నారు. యువగళం కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. ఇదిలా ఉంచితే భవిష్యత్లో పార్టీని నడిపించే సత్తా చినబాబుకు ఉందా అనేది ఇక్కడ ప్రధాన సందేహం. జగన్ ను తట్టుకొని ఈ యువనేత నిలబడగలడా..? అనేది ప్రస్తుతం చర్చనీయాంశం.
మారిన శైలి.. మాటతీరు
అయితే యువగళం ప్రారంభమైన నాటి నుంచి యువనేతలో మార్పు కనిపిస్తున్నది టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఆయన వ్యవహార శైలి మాత్రమే కాదు… మాట తీరు కూడా మారిందని చర్చించుకుంటున్నాయి. వైసీపీ పాలన, ఆగడాలను ధైర్యంగా ప్రశ్నిస్తూ యువనేత ముందుకెళ్లడం ప్రస్తుతం ఆ పార్టీలో జోష్ నింపుతున్నది. పార్టీలో ఉన్న సీనియర్లను గౌరవిస్తూ, వారి సలహాలు తీసుకుంటూ యువగళం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. తాను వెళ్లే నియోజకవర్గంలో పరిస్థితి, సమస్యలు, అక్కడి ఎమ్మెల్యే పనితీరును ముందుగానే తెలుసుకొని ప్రజల వద్దకు వెళ్తున్నారు.
ప్రజల్లో కలిసిపోయి, వారిని నవ్వుతూ పలకరిస్తూ, కుటుంబ సభ్యుడిలా మాట్లాడుతున్నారు. ప్రత్యర్థి శిబిరంలోని సోషల్ మీడియాలో తనపై వ్యంగ్య ప్రచారం చేస్తున్నా, లోకేశ్ ఎక్కడా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. 2024లో పార్టీని అధికారంలోకి తేవడం, చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి చేయడం, రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకోవడం ఇదే తన ప్రణాళిక అని చెబుతున్నారు. పాదయాత్ర ప్రారంభం కాకముందు ఉన్న ఎన్నో సందేహాలను తమ యువనేత తీర్చాడని పార్టీ అభిమానులు చెబుతున్నారు. మరోవైపు పార్టీలోని యువ నాయకులు, యువతీయువకులు లోకేశ్ వెంట కలిసి నడుస్తున్నారు. పప్పు కాదు ఇక్కడ నిప్పు అంటూ రివర్స్ సెటైర్లు ప్రత్యర్థులకు పంపుతున్నారు. అయితే లోకేశ్ లో వచ్చిన ఈ మార్పు పార్టీకి మంచి చేస్తుందా అనేది 2024లోనే తేలనుంది.