
Chandrababu Convoy : విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లిన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని చూసేందుకు ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. ఏం జరుగుతుందో తెలియక సెక్యూరిటీ సిబ్బంది కంగారుపడ్డారు. ఆమె మాత్రం ఆగకుండా.. చంద్రబాబు కాన్వాయ్ వెంట పరుగులు తీసింది.
మహిళను కారులో నుంచి గమనించిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపారు. ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు. ఆమె చంద్రబాబును ఆప్యాయంగా పలకరించారు. తాను మదనపల్లి నుంచి వచ్చినట్లు చెప్పారు. తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చానన్నారు. తనను చూసి ఎమోషనల్ అయిన ఆ మహిళతో చంద్రబాబు కొద్దిసేపు మాట్లాడారు. సెక్యూరిటీని వారించి మరీ ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ గెలుపు కోసం రేయింబవళ్లు శ్రమించానని ఆమె తెలుపడంతో ఆయన థాంక్స్ చెప్పారు. 104 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ చూసేందుకు వచ్చానని, ప్రభుత్వం ద్వారా తనకు వైద్యసాయం అందించాలని ఆ మహిళ చంద్రబాబును కోరింది. మహిళకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా ఆమెతో చంద్రబాబుతో ఫొటో దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.