
Silence of KCR : తెలంగాణలో రాను రాను ఎన్నికల హీట్ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వంలోకి వచ్చిన బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఈ సారి కూడా వస్తుందా..? అన్న అనుమానాలు కొనసాగుతుండగానే.. కాంగ్రెస్, బీజేపీ సభలు, సమావేశాలు, నిరుద్యోగ మార్చ్ లు నిర్వహిస్తూ సక్సెస్ కూడా చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ‘యువ సంఘర్షణ సభ’ పెట్టిన కాంగ్రెస్ ప్రియాంకా గాంధీని తీసుకువచ్చి సభను భారీగా సక్సెస్ చేసింది. ఇక నిన్నటికి నిన్న బీజేపీ చీఫ్ సంగారెడ్డిలో నిర్వహించిన ‘నిరుద్యోగ మార్చ్’ కూడా సక్సెస్ అయ్యింది. తామంటే తాము అధికారంలోకి వస్తామంటూ పోటా పోటీగా సభలు, సమావేశాలు పెడుతున్నాయి బీజేపీ, కాంగ్రెస్.
అయితే బీఆర్ఎస్ మాత్రం తమను తమ పథకాలే గెలిపిస్తాయని నమ్ముతున్నాయి. రాను రాను అధినేత కేసీఆర్ మౌనంగా (Silence of KCR) ఉండడం బీజేపీ, కాంగ్రెస్ దూసుకుపోతుండడంతో పార్టీ నాయకుల్లో కొంచెం నైరాశ్యం కనిపిస్తున్నా కేసీఆర్ దాన్ని కవర్ చేస్తున్నారు. ఇక వన్ మ్యాన్ షో చేస్తున్న కేటీఆర్ వారికి బూస్ట్ ఇస్తూ అప్పుడప్పుడూ లేపుతున్నాడు. ఇప్పటికీ తెలంగాణలో నిరుద్యోగ సమస్యలు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్, టెన్త్ పేపర్ లీకేజీ, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ, పథకాల్లో ఎమ్మెల్యేల, పార్టీ నాయకుల చేతివాటం ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ తమను అగాధంలోకి నెడతాయా..? అని పాలకపక్షం ఆందోళనలో ఉంటే ప్రతిపక్షానికి మాత్రం కావాల్సినంత స్టఫ్ దొరికినట్లయ్యింది.
కాంగ్రెస్, బీజేపీ సక్సెస్ పై బీఆర్ఎస్ పార్టీలో బాహాటంగానే చర్చలు జరుగుతున్నాయి. మొదటి సారి తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వస్తే.. రెండో సారి సరైన ప్రతిపక్షం లేక అధికారం చేబట్టామని. ఇక ఈ సారి ఆ ఆటలు సాగేలా లేవని అనుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఫుల్ జోష్ లో పని చేస్తుంటే తాము ఏం చేయాలని చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు గెలిపిస్తాయన్న నమ్మకం రాను రాను కనుమరుగువుతూ వస్తోందని చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలకు సరైన వాయిస్ కూడా లేకపోవడంతో ఈ సారి ఎలా నెగ్గుకు రావాలని యోచిస్తున్నారు. అధినాయకుడు కేసీఆర్ మాత్రం ఇవన్నీ చూస్తూ ఉన్నాడు.






