
Sharmila : వైఎస్ కుటుంబంలో విభేదాలు ఇక ఇప్పట్లో తగ్గేలా లేవు. అసలు తగ్గుతాయా అనేది కూడా డౌటే. ఎందుకంటే ఎన్నికల ముందు అన్న జగన్ పై షర్మిల ఓ రేంజ్ లో విమర్శలు చేసింది. ఎన్నికల వేళ జగన్ కు కొరకరాని కొయ్రలా మారి చివరకు జగన్ ఓటమిలో తాను కూడా ఓ కారణమైంది. ఇక ఎన్నికల్లో దారుణ పరాజయం చవిచూసిన జగన్ ను ..ఇప్పటికీ కూడా షర్మిల వదలడం లేదు. అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
మొన్న వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను ఉద్దేశించి కూడా షర్మిల ..జగన్ పై తీవ్రస్థాయిలోనే మండిపడింది. వైఎస్ రాజకీయ వారసుడిని అని చెప్పుకునే జగన్ రెడ్డి..సొంత తండ్రి జయంతి వేడుకలను తూతూ మంత్రంగా నిర్వహించారని.. తండ్రి జయంతి వేడుకలను నిర్వహించే పద్ధతి ఇదేనా అంటూ గట్టిగానే వాయించేశారు. ఎన్నికల్లో సిద్ధం సభల పేరుతో ఒక్కో సభకు 30,40 కోట్లు ఖర్చు చేసిన జగన్..తండ్రి జయంతి రోజున కనీసం ఒక సభను కూడా ఏర్పాటు చేయలేకపోయారని కడిగిపారేసింది. వైఎస్ జయంతి మీకు స్పెషల్ కాదా? ఇలాగేనా జరుపుకునేది అంటూ షర్మిల విరుచుకపడింది.
కాగా, షర్మిల తాత్కాలిక రాజకీయాల కోసం కాకుండా వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ అభిమానులను, సన్నిహిత నేతలను కాంగ్రెస్ గొడుగు కిందకు తీసుకురావడమే ధ్యేయంగా రాజకీయం చేస్తున్నారు. అందుకే ఆమె..అన్న జగన్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి.
వైసీపీని దెబ్బకొట్టడమే తన కర్తవ్యంగా షర్మిల ముందుకెళ్తున్నారు. అయితే జగన్, వైసీపీ నేతలు మాత్రం షర్మిలపై నోరు మెదపడం లేదు. జగన్ తన చెల్లికి కౌంటర్ ఇచ్చే సాహసానికి ఇప్పట్లో ముందుకు రాకపోవచ్చు. దీంతో షర్మిలను ఢీకొట్టేందుకు వైసీపీ నుంచి జగన్ ఎవరిని రంగంలోకి దింపుతారా? అనే కోణంలో రాజకీయ చర్చలు సాగుతున్నాయి. షర్మిలపై జగన్ ఎవరిని బాణంగా ఉపయోగిస్తారో చూడాల్సి ఉంది.