
గ్రౌండ్ రిపోర్ట్: ద్విముఖ పోరు
అసెంబ్లీ నియోజకవర్గం: బనగానపల్లె
వైసీపీ: కాటసాని రామిరెడ్డి
టీడీపీ: జనార్దన్ రెడ్డి
Banaganapalle Constituency Review : నంద్యాల జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో బనగానపల్లె ఒకటి. ఇక్కడి నేతలకు పంతాలు పట్టింపులు ఎక్కువే. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి గడ్డ ఇదే అందుకే ఇక్కడి నాయకులకు ప్రజాసేవ, ధర్మనిరతి ఎంత ఉంటుందో పంతాలు, పట్టింపులు కూడా అంతే ఉంటాయి. చాలా చోట్ల నేతలు ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా సాధారణ సమయంలో మాత్రం కలిసే ఉంటారు. అయితే, బనగానపల్లె దీనికి అపోజిట్ అనే చెప్పాలి. అక్కడి నేతలు ఎప్పటి నుంచో సై అంటే సై అంటుంటారు.
నంధ్యాల జిల్లాలోని ప్రధాన పట్టణం కోయిలకుంట్ల నుంచి బనగానెపల్లె ఆవిర్భవించింది. 2008 డీ లిమిటేషన్ లో భాగంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఇందులో 2,33,290 మంది ఓటర్లు ఉన్నారు (2019 నాటికి). ఇందులో ప్రధానంగా ఐదు మండలాలు ఉన్నాయి. 1. బనగానపల్లె, 2. కోయిలకుంట్ల, 3. ఓక్, 4. సంజామల, 5. కొలిమిగుండ్ల. ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువ. ఉన్న మిగతా జనాభాలో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలే ఎక్కువ ఉన్నాయి.
వ్యవసాయం ప్రధాన జీవనాధారమైనా.. విపరీతంగా మైనింగ్ నడుస్తుంది. సున్నపురాయి నిక్షేపాలు ఎక్కువగా ఉండడంతో భారీ నుంచి అతి భారీ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. ఈ కానిస్టెన్సీని ‘సిమెంట్ హబ్’గా కూడా చెప్పవచ్చు. సాగునీటి వనరులతో మంచి పంటలు పండిస్తున్నారు. దేశంలో ప్రసిద్ధి చెందిన గుహలు, ఆలయాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.
సిట్టింగ్ పార్టీ వైసీపీ
బనగానపల్లెలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. కాటసాని చిన్నతనం నుంచే రాజకీయ అనుభవం నేత. తన అన్న గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. పైగా వారిది ఫ్యాక్షన్ ఫ్యామిలీ. ఇదంతా ఒక ఎత్తయితే.. దాన ధర్మాలలో గొప్ప వాడిగా కీర్తి గడించారు. మంచి సమయస్ఫూర్తి ఉన్న నేత. తన నిమోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నికల్లో (2009) కాంగ్రెస్ అభ్యర్థి చల్లా కేఆర్ రెడ్డిపై భారీ మెజారిటీ సాధించారు. ఆ తర్వాత 2014లో ఓటమి చవిచూశారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని రామిరెడ్డి చెప్పుకుంటుండగా.. అదేం లేదంటూ ప్రత్యర్థులు చెప్తున్నారు. ఇరు వర్గాల మధ్య వైరం కామనే అయినా కనుచూపు మేర అభివృద్ధి కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హామీలను నెరవేర్చడంతో పాటు హామీలు ఇవ్వని పనులను కూడాచేశానని ఆయన చెప్తున్నా.. మౌలిక వసతులైన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ లాంటి పనులు కూడా నియోజకవర్గం కేంద్రంలోనే జరగలేదని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కాటసానికి అసమ్మతి లేకున్నా.. మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధి రెడ్డితో పాటు దివంగత నేత చల్లా రామకృష్ణారెడ్డి కోడలు బిజ్జం కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. రెండు పర్యాయాలు ఏలిన నేతగా రామరెడ్డికి గుర్తింపు ఉండడంతో ఈ సారి కూడా ఆయనకే టికెట్ వస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని వాదనలు వినిపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ జనార్దన్ రెడ్డి
జనార్దన్ రెడ్డికి బనగానపల్లెపై మంచి పట్టు ఉంది. ఒక పర్యాయం ఆయన ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. ఆర్థికంగా ఫిట్ గా ఉన్న నేతగా కూడా గుర్తింపు ఉంది. 2014లో కాటసానిపై 20వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. కాటసానికి జానార్దన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుందని నియోజకవర్గం మొత్తం తెలిసిందే. గతంలో కూడా ఈ నేతలు అసెంబ్లీ సాక్షిగా తీవ్రంగా ధూషించుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుతం నియోజకవర్గాన్ని తన గుప్పిట్లోకి తీసుకచ్చేందుకు జనార్దన్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
చాలా రోజుల నుంచి నియోజకవర్గంలో తిరుగుతూ, పలు కార్యక్రమాలు చేపడుతూ పట్టును పెంచుకుంటున్నారు. ప్రస్తుతం రామిరెడ్డికి అసమ్మతి ఎక్కువగా ఉందని, దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నారు జనార్దన్ రెడ్డి ఈ సారి కూడా టీడీపీ తనకే టికెట్ ఇస్తుందని, ఇస్తే గెలుపు తథ్యమని ధీమాగా ఉన్నారు ఆయన. నియోజకవర్గంలో ఈయనకు కూడా అసమ్మతి లేదు. పట్టును ఎక్కడా సడలించకుండా చూసుకున్నారు.
ఇద్దరు నేతల మధ్య ఈ సారి ఫైట్ తీవ్రంగా ఉండబోతోంది. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాటసాని, ఒక్కసారి ఎమ్మెల్యేగా చేసిన బీసీ జనార్దన్ రెడ్డి ఇద్దరిలో ఒకరినే గెలుపు వరిస్తున్నారు. ఈ సారి ఎక్కువ అవకాశం మాత్రం బీసీ జనార్దన్ రెడ్డికే కనిపిస్తుందని నియోజకవర్గం గ్రౌండ్ రిపోర్టులో తెలుస్తోంది.






