
Jagan Why Not 175 : ఎదురుదెబ్బల నుంచి ఎంత త్వరగా పాఠాలు నేర్చుకుంటే అంత మంచిది. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి త్వరగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. తన నోటి నుంచి వచ్చే మాటల్లో తేడా తన తీరును వేలెత్తి చూపేలా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2019లో తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకొని..ప్రజాస్వామ్యంలో ఎవరికి సాధ్యం కాని నూటికి నూరు శాతం సీట్లను సొంతం చేసుకోవాలన్న అత్యాశను తెర మీదకు తీసుకొచ్చి వైనాట్ 175? అంటూ చేసిన ప్రచారాన్ని, ఎవరెన్ని చెపక్పినా అదే పాట పాడిన జగన్.. ఎన్నికల వేళ తేడా గాలి వీస్తుందని చెప్పినా వినకుండా గత ఎన్నికల్లో వచ్చిన 151 సీట్ల కంటే అధికంగానే గెలుస్తామని తాను నమ్మి.. తన వాళ్లను నమ్మించిన దానికి జరిగిన నష్టం గురిచం జగన్ మరిచిపోయినట్టున్నారు. తనకు ఓట్లేయని అవ్వతాతల, అక్కాచెల్లెళ్ల మీద ప్రశ్నల వర్షం కురిపించిన జగన్ తాజాగా తన రాజకీయ ప్రత్యర్థి మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడై నెల రోజులు కూడా కాలేదు. అలాంటిది ఐదేళ్లకు జరిగే ఎన్నికల ఫలితాల మీద మాట్లాడటం. తన అంచనాలు చెప్పటం ఏ మాత్రం మంచిదికాదు. ఇప్పటికి ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి చాలామంది వైసీపీ నేతలు.. కార్యకర్తలు కోలుకున్నది లేదు. ఇలాంటి సమయంలో మళ్లీ తనదైన రీతిలో వచ్చే ఎన్నికల్లో తమ రాజకీయ ప్రత్యర్థులను సింగిల్ డిజిట్ కే పరిమితం చేద్దామన్న పిలుపు అత్యాశే అవుతుంది.