
BJP mission : వచ్చే ఏడాది జనవరి వరకు అసెంబ్లీ కాలం ముగియనున్న ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. ఈ ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉన్నది. ఇప్పటికే రాష్ర్టంలో మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, అధికార పార్టీ బీఆర్ ఎస్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాయి. టీబీజేపీ మాత్రం ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైంది. మిషన్ -90 పేరుతో 90 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నది.
లక్ష్యం నెరవేరేనా?
తాము అనుకున్న స్థానాల్లో గెలుపు సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. అయితే మొన్నటి వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ల నుంచి పెద్ద సంఖ్యలో వలసలు ఉంటాయని భావించినా ప్రస్తుతం అదేమి కనిపించడం లేదు. కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు బీజేపీ ఆశలకు గండికొట్టింది. ఇక రేపో,మాపో చేరుతారు అనుకున్న నేతలు కూడా ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఎన్నికల్లో గెలుపునకు బీజేపీ ముందు పలు సవాళ్లు ఉన్నాయి.
ముస్లిం ఓటర్ల మద్దతిచ్చేనా?
తెలంగాణలో 12.7 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. అంటే దాదాపు 44, 64,669 మంది ముస్లింలున్నారు. హైదరాబాద్లో 17.13లక్షల ముస్లింలున్నారు. బీజేపీ సిద్ధాందాల్లో వైరుద్యం కారణంగా చాలా మంది ముస్లిం ఓటర్లు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ట్రిపుల్ తలాఖ్ విషయంలో మాత్రం ఉత్తరాది రాష్ట్రాల్లో ముస్లిం మహిళలు బీజేపీకి మద్దతిచ్చారు. 12 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు బీఆర్ఎస్ కు మద్దతు పలికారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సైతం బీఆర్ఎస్కు అండగా నిలవాలని పలుచోట్ల ప్రచారం చేశారు. కేవలం పాతబస్తీ కే ఎంఐఎం పరిమితమవుతున్నది. పరోక్షంగా తాము మద్దతు తెలిపే పార్టీకి ఓటు వేయాలని ఎంఐఎం నేతలు ముస్లింలను కోరుతున్నారు. గతంలోనూ సెక్యులర్ భావాలున్న కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు పలికింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు కీలకం కానున్న నేపథ్యంలో బీజేపీ గెలుపు సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. దళితులు, కమ్యూనిస్టులు సైతం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో వీరి ఓట్లు కీలకం కానున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ సిలిండర్ ధర పెంపు వంటి అంశాలు రానున్న ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి.
వ్యతిరేకత ఎంత..?
2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఐదు స్థానాల్లో విజయం సాధిచింది. అవి కూడా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే. ఆది నుంచి అర్బన్ ఏరియాలో బీజేపీకి పట్టు ఉన్నా 2018లో అక్కడా తమ ప్రభావాన్ని కోల్పోయింది. 2018లో ఒక్కరే గెలిచారు. ప్రస్తుతం అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు కావాల్సి ఉంది. బీజేపీ అధినాయకత్వం కూడా దీనిపైనే ఫోకస్ చేస్తున్నది.
పార్టీలో, ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడిన వారికి.. నియోజకవర్గంపై పట్టు ఉన్న నేతలు ఎవరనే అంశంపై దృష్టి పెట్టింది. అధికార పార్టీలోని అసంతృప్తులకు తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అధికార పార్టీలో జరిగే పరిణామాలను బట్టి బీజేపీ లో చేరికలు ఉంటాయని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తున్నది. మరో రెండు నెలల్లో బీజేపీలో చేరేది ఎవరూ.. ఉన్నవారిలోంచి పోయేది ఎవరో తెలుస్తుంది. అధికార పార్టీని ఢీకొనడం ఇప్పటికిప్పడు సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
బండి వైఖరిపై పెదవి విరుపు
బీజేపీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కొత్తలో పార్టీకి ఊపు తెచ్చారు. తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యా్మ్నాయం బీజేపీనే అనే స్థాయికి తీసుకువచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నకల్లోనూ బీజేపీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్లు సాధించి, నగరంపై పట్టు నిలబెట్టుకుంది. రానురాను బండి సారథ్యంపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి వెల్లడవుతున్నది. అధికార పార్టీ వైఫల్యాలపై పూర్తిస్థాయిలో దాడికి దిగడ లేదు. అధికార పార్టీపై కౌంటర్లు ఇవ్వడానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ర్ట ధ్యక్షుడు మాత్రమే ముందుంటున్నారు. మిగతా వారు ఉన్నా లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీ లో చేరిన ఈటల కూడా అంతగా ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులు కవిత ను అరెస్టు చేయకపోవడంపై బీజేపీ, బీఆర్ ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ విమర్శిస్తున్నది. ఇది కూడా బీజేపీకి కొంత మైనస్ గామారే సూచనలు ఉన్నాయి.






