
Railway history Kavach : దేశ రైల్వే చరిత్రలో అతిపెద్ద ఘోర రైలు ప్రమాదం ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారాన్ని బట్టి సుమారు 233 మంది ప్రయాణికులు మరణించగా, సుమారు వెయ్యి మంది వరకు గాయపడినట్లు తెలుస్తున్నది. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ అన్వేషిస్తున్నది.
శుక్రవారం సాయంత్రం బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్ లోని హావ్ డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్ డా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద పట్టాలు తప్పడంతో దాని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్ పై పడిపోయాయి. సాయంత్రం 7గంటలకు షాలిమార్ – చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ ప్రెస్ 128 కిలో మీటర్ల వేగంతో ఆ బోగీలను ఢీకొట్టింది.
సాధారణంగా గంటకు దాదాపు 130 కి.మీ. వేగంతో వెళ్లే రైలు వేగం సున్నాకు చేరుకునేందుకు అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే 60 నుంచి 80 సెకన్లకు పైగా సమయం పడుతుందట. కానీ ప్రమాదం జరిగి 23 సెకన్లలోనే వేగం జీరో కు చేరుకుందంటే పట్టాలపై ఉన్న బోగీలను కోరమండల్ ట్రైన్ ఎంత బలంగా ఢీకొట్టిందో అర్థం చేసుకోవచ్చు.
అనంతరం ఈ బోగీలను మరో గూడ్సు రైలు ఢీకొంది. అయితే ఘటనపై ప్రత్యక్ష సాక్షుల కథనం, స్థానిక సిబ్బంది కథనం వేర్వేరుగా ఉన్నయి. ఏదేమైనా పూర్తి విచారణకు కేంద్ర రైల్వేశాఖ ఆదేశించింది. త్వరలోనే ఇది మానవ తప్పిదమా.. సాంకేతిక లోపమా తేలనుంది.

తెరపైకి కవచ్ టెక్నాలజీ..
ఘటనాస్థలంలో ప్రమాద తీవ్రత చూస్తే మాత్రం ఇది ఘోర వైఫల్యాంగానే కనిపిస్తున్నది. ఇదే సమయంలో కవచ్ టెక్నాలజీ అవసరాన్ని అంతా చర్చిస్తున్నారు. భారతీయ రైల్వే ప్రమాద నిరోధక వ్యవస్థే ఈ ‘కవచ్’ . రెండు రైళ్లు ఒక ట్రాక్ లో వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్ గా ఆగిపోయేలా పనిచేస్తుంది. దీంతోపాటు ఈ టెక్నాలజీ రైళ్లను వెనక్కి కూడా నడిపిస్తుంది. దీంతో ఏ రెండు రైళ్లు కూడా ఢీకొనే అవకాశమే ఉండదు.
అయితే ఈ వ్యవస్థ మరి అమల్లో ఉందా లేదా అనేది రైల్వే శాఖకే తెలియాలి. ఇలాంటి రక్షణ వ్యవస్థ అందుబాటులో ఉన్నా ఈ ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వేశాఖ పనితీరుపై ఎన్నో సందేహాలను రేపుతున్నాయి. ఇప్పటికే గత ఐదారేండ్లుగా రైల్వేశాఖ పనితీరుపై ప్రయాణికులు పెదవివిరస్తున్నారు. అసలు కేంద్రంలోని బీజేపీ సర్కారు రైల్వే వ్యవస్థను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రమాదం కూడా వారి నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు.






