
YS Jagan : ఎన్నికల ముందు ఆ తర్వాత వైసీపీని వీడిన వారు జగన్ నాయకత్వాన్ని మొదటి నుంచి తప్పుబడుతున్న వారు ఇప్పుడు జగన్ మీద మూకుమ్మడి విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ తన పార్టీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలకు విలువ ఇవ్వడు. పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోడని వాపోతున్నారు. ఆయన హయాంలో కనీసం మంత్రులకు కూడా జగన్ విలువ ఇవ్వడు అని అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. పార్టీలో ఏ స్థాయి నాయకుడైనా సరే తాడేపల్లి ప్యాలస్ లో జగన్ దర్శనం కోసం గేటు ఎదుట ఆయన అనుమతి వచ్చే వరకు చేతులు కట్టుకుని ఎదురు చూడాలి.
తమ నియోజకవర్గ సమస్యలను విన్నవించుకునేందుకు తమ మంత్రిత్వ శాఖలపై అనుసరించవలసిన వ్యూహాలను తెలుసుకునేందుకైనా తాడేపల్లి ప్యాలస్ తలుపు తడితే తీసేందుకు ఎంత సమయం పడుతుందో సొంత పార్టీ నేతలకే తెలియని పరిస్థితి ఉంటుంది. అధికారంలో ఉన్నన్నాళ్లు తన ఎమ్మెల్యే లను పిలిపించి పరిస్థితులపై అవగాహన కల్పించకుండా. భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరపకుండా నియంతలా తాను చెప్పిందే శాసనం అన్నట్టు ప్రవర్తించారు.
దాని ఫలితాన్ని 2024 ఎన్నికల్లో వైసీపీ నాయకులు అనుభవిస్తున్నారు. క్షవరం అయితే కానీ జగన్ కు వివరం రాలేదా? అన్నట్టుగా 151 సీట్ల నుంచి 11 సీట్లకు వస్తే గానీ జగన్ కు సొంత పార్టీ నాయకులకు కాస్త సమయం ఇవ్వాలనే విషయం తెలియరాలేదు. గతంలో వారాలపాటు ఎదురు చుస్తే గానీ దక్కని జగన్ అపాయింట్ మెంట్ ఇప్పుడు తలుచుకుంటే అయిపోతుంది అనేలా మారిపోయింది.
జగన్ ఓడిపోయిన తర్వాత తమ పార్టీ నాయకులను తాడేపల్లి రాజమందిరానికి పిలిపించుకొని రానున్న కాలంలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. పార్టీ తరుఫున ఓడిపోయిన నాయకులను పిలిపించి పార్టీ వీడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు చేసిన పాపాలకు నేటి ప్రభుత్వంలో శిక్షలు పడుతున్న తరుణంలో జగన్ కు పార్టీ నాయకులు గుర్తొస్తున్నారు. ఈ రోజు తాడేపల్లి క్యాంపు ఆఫీసులో వైసీపీ ముఖ్యనేతలతో జగన్ సమావేశం అయ్యారు. ఇందులో ముద్రగడ పద్మనాభ రెడ్డి, కాసు మహేశ్ రెడ్డి వంటి సీనియర్ నాయకులున్నారు. ప్రస్తుత రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది.? వైసీపీ నాయకుల అరెస్టుల విషయంలో ప్రజాభిప్రాయంపై చర్చలు జరిగినట్టు సమాచారం.
అధికారంలో ఉన్న సమయంలో ఎదుటి వారి అభిప్రాయాన్ని గౌరవించినా కనీసం విన్నా ఇప్పుడు మంచి చేస్తే ఎందుకు ఓడిపోయానంటూ ఎదురు ప్రశ్న వేసే దుస్థితి జగన్ కు వచ్చేది కాదు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజల ఆవేదన అర్థం చేసుకోలేదు, ప్రతిపక్షాల పోరాటాలను అవగాహన చేసుకోలేదు, సొంత పార్టీ నేతల ఆలోచనలను గౌరవించలేదు.