
YS Jagan : ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైంది. ఎన్నికల తర్వాత తొలిసారి పులివెందులకు వచ్చిన మాజీ సీఎం జగన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. అందులో ఎక్కువ శాతం పెండింగ్ బిల్లుల బాధితులే ఉన్నారు. దీంతో పెండింగ్ బిల్లుల గోల తలపోటుగా మారడంతో తన పర్యటన అకస్మాత్తుగా ముగించుకుని బెంగళూరుకు వెళ్లిపోయారు.
అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎన్నడూలేని విధంగా పులివెందుల నివాసంలో మూడు రోజుల పాటు గడిపారు. ఎక్కువమంది గత ప్రభుత్వ హయాంలోని బిల్లుల బకాయిల గురించి ప్రస్తావించారు. 2019కి ముందు టీడీపీ హయాంలో చేసిన పనులకు బిల్లుల విషయంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పుడూ అలాగే జరిగితే తమ పరిస్థితి ఏంటని జగన్ ఎదుట పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ (పాడా) కింద 2019-20 నుంచి రూ. 963 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ప్రతిపాదించారు. వాటిలో చాలావరకు ప్రజలకు ఉపయోగంలేనివే. పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలను మచ్చిక చేసుకోవడానికి ‘పాడా’ నిధులను ఇష్టం వచ్చినట్లు పంచి పెట్టారు. వీటితో పాటు ఉపాధి హామీ నుంచి రూ. 26 కోట్ల నిధులను మట్టి రోడ్ల కోసం పంచిపెట్టి పనులు చేయకున్నా బిల్లులు చేశారు.
కానీ సాధారణ వైసీపీ కార్యకర్తలకు బకాయిలు నిలిచిపోయాయి. పనుల్లో అక్రమాలు జరిగినందున ‘పాడా’పై విచారణ చేపట్టాలని, కూటమి ప్రభుత్వం వద్ద పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా పాడా ఓఎస్డీ అనీల్కుమార్రెడ్డిని రిలీవ్ చేయకుండా కొత్త ప్రభుత్వం విధుల్లోనే ఉంచింది. ఒకవేళ విచారణ జరిగితే తమ పరిస్థితి ఏమిటని పెండింగ్ బిల్లులున్న నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.