
YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి బుధవారం విజయవాడలోని తన నివాసంలో గృహ నిర్బంధంలో ఉంచబడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర రాజధాని అమరావతిలో పర్యటన సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ చర్యను ఆమె తీవ్రంగా ఖండించారు. “పార్టీ కార్యాలయానికి వెళ్లడం నేరమా? మా రాజ్యాంగ హక్కులను ఎందుకు కాలరాస్తున్నారు?” అని ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు.
అమరావతి రాజధాని సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ‘అమరావతి క్యాపిటల్ కమిటీ’ కారణంగా ప్రభుత్వం భయపడుతోందని షర్మిల ఆరోపించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని డిమాండ్ చేశారు. గృహ నిర్బంధం నుండి విడుదలైన తర్వాత, షర్మిల తన మద్దతుదారులను కలిసి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.