Deer cooked : వారు బాధ్యత గల నాయకులు. అధికార పార్టీ నేతలు. తప్పులు చేయకుండా ఉండాలి. ప్రజల సమస్యలు పరిష్కరించాలి. కానీ వారు తమ చేతివాటం ప్రదర్శించారు. శేషాచలం కొండల నుంచి దారి తప్పిన చుక్కల దుప్పి వారి ఆకలికి ఆహారమైపోయింది. జంతువులను కూడా ప్రేమించాల్సిన వారు దాన్ని మజా చేస్తూ తిన్నారు. విషయం కాస్త బయటకు తెలియడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని యర్రావారిపాళ్యం మండలంలోని వీఆర్ అగ్రహారం పంచాయతీ పరిధిలో మంగళవారం సాయంత్రం ఓ చుక్కల దుప్పి పొలాల వైపు వచ్చింది. అక్కడే ఉన్న వైసీపీ నేతలు దాన్ని వెంబడించి వెంటాడి పట్టుకుని కోసుకుని వండుకుని తిన్నారు. దాన్ని పట్టుకునేందుకు సాయిబులపల్లికి చెందిన మహిళలు కూడా తోడయ్యారు.
వైసీపీకి చెందిన నాయకులు వీఆర్ అగ్రహారం సర్పంచ్ చంద్రయ్య, క్రిష్ణయ్య, నాగేశ్వర్ రావు, చిన్నబ్బ, మహిళలు కలిసి దుప్పిని చంపారు. అనంతరం వండుకుని తిన్నారు. ఇదంతా ఓ వ్యక్తి రహస్యంగా ఫొటోలు, వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. దీంతో వైసీపీ నేతల తీరుపై విమర్శలు వస్తున్నాయి.
దీనికి కారణమైన క్రిష్ణయ్యను అరెస్టు చేశారు. ఈ ఘటనలో మిగతా వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు. అడవి జంతువుల వేటలో ఇదివరకు సినీనటుడు సల్మాన్ ఖాన్ కోర్టుల చుట్టు తిరిగిన సంగతి తెలిసినా వారు ఇలా చేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఈ కేసు ఎక్కడకు వెళ్తుందో తెలియడం లేదు.