
CM Revanth : వైఎస్సార్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వైఎస్సార్ ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ముద్ర ప్రజల గుండెల్లో భద్రంగా ఉందన్నారు. సంక్షేమం అంటే వైఎస్సార్ గుర్తుకొస్తారని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు వైఎస్సార్ సంక్షేమమే స్ఫూర్తి అని అన్నారు. వైఎస్సార్ భౌతికంగా ప్రజల మధ్య లేకున్నా ఆయన స్ఫూర్తి బతికే ఉంటుందన్నారు. వైఎస్ అకాల మరణం కాంగ్రెస్ కు తీరని లోటన్నారు. ప్రధాని పదవికి రాహులక ఒక్క అడుగు దూరంలో ఉన్నారని సీఎం చెప్పారు.
రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు కార్యకర్తలు కష్టపడాలని కోరారు. రాహుల్ ప్రధాని అయితేనే పేదలకు మేలు జరుగుతుందన్నారు. రాహుల్ ను ప్రధాని చేయడమే లక్ష్యమని వైఎస్సారు చెప్పారన్నారు. వైఎస్సార్ నిజమైన వారసులు కాంగ్రెస్ లోకి రావాలని సూచించారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి వైఎస్సార్ పాదయాత్ర స్ఫూర్తి అని వెల్లడించారు.