
ఢిల్లీ బీజేపీ పెద్దలు రాష్ట్రంలో ఏ రకమైన బహిరంగ సభలు పెట్టిన బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కలవర పాటుకు గురవుతుంటుంది. ఢిల్లీ కాషాయ పెద్దల వాయిస్ పబ్లిక్లోకి వెళ్లకుండా కౌంటర్ ప్రోగ్రామ్స్ చేయడం భారాస నాయకత్వానికి అలవాటు. గతంలో పలుమార్లు ఇలాంటి కార్యక్రమాలే చేసి తెలంగాణ లో భాజపా వేవ్ పెరగకుండా బీఆర్ఎస్ అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంది. బీజేపీ జాతీయా కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరిగినప్పుడు సిటీ మొత్తం పోస్టర్లు వేసింది. అంతేకాక కాంగ్రెస్,విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచిన యశ్వంత్ సిన్హాను ఆగమేఘాల మీద తెలంగాణకు రప్పించి బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఇక ఇటీవల ప్రధాని మోడీ సికింద్రాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన విషయం తెలిసింది. అనంతరం పరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. అయితే మోడీ మీటింగ్ జరగడానికి ముందే సిటీలో పలుచోట్ల ఆయనకు,బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఇక ఆదివారం వికారాబాద్ జిల్లా చేవెళ్ల కేవీఆర్ గ్రౌండ్లో బీజేపీ నిర్వహించేబోయే బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు.
ఈ నేపథ్యంలోనే గతంలో మాదిరే మళ్లీ ఎక్కడైన బీఆర్ఎస్ నాయకత్వం పోస్టర్లు వేస్తుందా..? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెవేళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి కేవలం 14 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. ఈసారి ఆయన గెలవొచ్చనే చర్చ వికారాబాద్ జిల్లాలో సాగుతోంది. దీనికి తోడు అమిత్ షా కూడా ఆ సెగ్మెంట్ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు సిద్ధపడుతుండడంతో..బీఆర్ఎస్ అధినాయకత్వంలో కలవరం మొదలైంది. అయితే అమిత్ షా వాయిస్,బీజేపీ వేవ్ను తగ్గించేందుకు ప్రస్తుతం భారాస నాయకత్వం ఎలాంటి ఎత్తుగడలను వేస్తుందనే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకు ముందు పోస్టర్లు అంటించిన మాదిరే మళ్లీ అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేయొచ్చనే డిస్కషన్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.






