
ఖలిస్తానీ వేర్పాటువాది వారిస్ పంజాబ్ దే సంస్థ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కు ఐఎస్ఐ తో లింకులు ఉన్నాయనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పంజాబ్ కు చెందిన అమృత్ పాల్ సింగ్ దుబాయ్ లో కొన్నాళ్ళు ట్రక్ డ్రైవర్ గా పనిచేసాడు. కాగా ఆ సమయంలో ఐఎస్ఐ ఉగ్రవాదులు అమృత్ పాల్ కు బ్రెయిన్ వాష్ చేసి భారత్ నుండి పంజాబ్ లోని ఖలిస్థాన్ ప్రాంతాన్ని దూరం చేయాలనే కుట్ర పన్నారని అందుకోసం అమృత్ పాల్ కు శిక్షణ ఇచ్చారని అంతేకాకుండా పెద్ద ఎత్తున విదేశాల నుండి అతడికి విరాళాలు అందేలా చేసారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గతకొంత కాలంగా ఖలిస్థాన్ వేర్పాటువాదం ఎక్కువయ్యింది. పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు కొందరు సిక్కులు. పెద్ద ఎత్తున యువతను ఉగ్రవాదం వైపు మళ్లేలా చేయడంలో అమృత్ పాల్ సింగ్ గట్టి ప్రయత్నాలు చేసాడని తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో అమెరికాలోని షాన్ ఫ్రాన్సిస్కో లోని భారత్ కాన్సులేట్ కార్యాలయం పై అమృత్ పాల్ సింగ్ అనుచరులు దాడి చేయడం గమనార్హం. అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. పోలీసులకు చిక్కినట్లే చిక్కి మాయమయ్యాడు.






