
ఈరోజుల్లో కాన్పు అంటే చాలు ఆపరేషన్ చేయడమే ! ఆపరేషన్ చేయకపోతే డాక్టర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు రావు కదా మరి. సాధారణ కాన్పులు ఈరోజుల్లో లేవంటే నమ్మండి అన్ని కూడా పెద్ద ఆపరేషన్ లు మాత్రమే ! అయితే ఏమాత్రం వైద్య పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లోనే పలువురు మహిళలకు కాన్పులు చేసిన మాతృదేవత డాక్టర్ సూలగిట్టి నరసమ్మ.
ఈ నరసమ్మ డాక్టర్ కోర్స్ చదివి డాక్టర్ అయిన వ్యక్తి కాదు సుమా ! ప్రజల నాడిని పట్టుకొని తన అత్త దగ్గర నేర్చుకున్న కొద్దిపాటి మెళుకువలకు తోడు తన అనుభవాన్ని రంగరించి మేథోమథనం చేసి గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించి 15 వేలకు పైగా కాన్పులు చేసి చరిత్ర సృష్టించిన మహనీయురాలు సూలగిట్టి నరసమ్మ. ఈ మాతృదేవత అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది.

సూలగిట్టి నరసమ్మ కర్ణాటక రాష్ట్రంలోని కృష్ణ పుర అనే గ్రామంలో 1920 లో జన్మించింది. 12 ఏళ్ల వయసులోనే నరసమ్మకు పెళ్లి అయ్యింది. ఆమెకు 12 మంది సంతానం. 20 ఏళ్ల వయసు నుండే కాన్పులు ఎలా చేస్తారు ? ఎలా చేస్తే మహిళలకు సుఖ ప్రసవం అవుతుంది అనే విషయాల్లో పూర్తి అవగాహనకు వచ్చేసింది. అలాగే సుఖ ప్రసవం కోసం ఎలా వ్యవహరించాలో గర్భణీ స్త్రీలకు తగిన సలహాలు , సూచనలు ఇస్తూ ఉండేది. నరసమ్మకు మొదటగా వచ్చిన భాష తెలుగు కావడం విశేషం. కర్ణాటక , మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాలు తెలంగాణ అంటే నైజాం నవాబు పరిపాలనలో ఉండేవి. అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నైజాంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. సూలగిట్టి నరసమ్మ 97 ఏళ్ల వయసులో 2018 డిసెంబర్ 25 న స్వర్గస్తులయ్యారు. 70 సంవత్సరాలకు పైగా గర్భిణీ స్త్రీలకు సేవలు అందించిన మహనీయురాలు నరసమ్మ.






