సియాచిన్.. పూర్తిగా ఇండియన్ ఆర్మీ స్వాధీనంలో ఉండే ప్రాంతం. కొంతకాలం గా ఇక్కడికి వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. జమ్ము కశ్మీర్, లడఖ్ లాగే ఇక్కడికి కూడా వెళ్లాలని అంతా అనుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు బేస్ క్యాంపు వరకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతులు లేవు. తాజాగా పర్యాటకుల విన్నపం మేరకు సియాచిన్ బేస్ క్యాంపు వరకూ వెళ్లేందుకు కేంద్ర పర్యాటక శాఖ అనుమతినిచ్చింది. అంటే సియాచిన్ వెళ్లాలనుకునే వారికి మాత్రం ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
సియాచిన్ ప్రత్యేకత ఏంటంటే.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన హిమానదాల్లో ఇది ఒకటి. ఇండియా, పాకిస్థాన్ మధ్య వివాదాల్లో ఉన్న ప్రాంతం కూడా ఇది. అత్యంత ఎత్తైన యుద్ధ భూముల్లో ఇది ఒకటి. అయితే రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం అక్కడికి పర్యాటకులను అనుమతించడం లేదు. సియాచిన్ బేస్ క్యాంపు హిమాలయాల తూర్పు కారాకోరం శ్రేణిలో సియాచిన్ బేస్ వద్ద ఉంది. 12000 అడుగుల నుంచి 15000 అడుగుల వరకు ఉంటుంది.
బేస్ క్యాంపు నిర్మాణానికి కారణం..
అయితే సైనికుల గౌరవార్థం సియాచిన్ బేస్ క్యాంపును నిర్మించారు. ఇక్కడ వారి స్మారక చిహ్నం కూడా ఉంటుంది. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన ఎంతో మంది వీర జవాన్లకు గుర్తుగా దీనిని నిర్మించారు. ఈ ప్రదేశం వద్ద ఉష్ణోగ్రత-60 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే వీలైనంత ఎక్కువ వెచ్చదనం ఇచ్చే దుస్తులు వేసుకుంటేనే ఇక్కడ ఉండగలం. అయితే సియాచిన్ లేహ్ నుంచి సుమారు 215 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. మొత్తంగా సుమారు 8 గంటల సమయం ప్రయాణానికే సరిపోతుంది. తొలుత లేహ్ నుంచి పనామిక్ చేరుకొని అక్కడి నుంచి బేస్ క్యాంపుకు వెళ్లే వీలుంటుంది. ఒక రోజు మొత్తం దీనికే సరిపోతుంది.