
PM Narendra Modi : 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ యూపీపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లుగా తెలుస్తున్నది. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఈ రాష్ర్టమే కీలకమని భావిస్తున్నది. 80 ఎంసీ సీట్లున్న యూపీలో 90శాతం వరకు గెలుచుకుంటేనే ఢిల్లీ పీఠం దక్కుతుందని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీకి చెందిన సర్వే టీం రంగంలోకి దిగిందట.
అయితే 2014 ఎన్నికల్లోయూపీలో 90 శాతం సీట్లను బీజేపీ గెలుచుకుంది. 2019 ఎన్నికలకు వచ్చే సరికి అది తగ్గింది. కేవల 80 శాతం సీట్లకే పరిమితమైంది. అయితే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా మునుపటి జోరు లేదు.అయితే ఇప్పుడు బీజేపీకి మరోసారి అయోధ్య రామమందిరం అంశం పూర్తి పాజిటివ్ కానుంది. వచ్చే ఎన్నికల్లోగా రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తే, ఇక అక్కడ ఆ పార్టీకి తిరుగుండదు. లోక్ సభ ఎన్నికల్లో మోడీ విజయం దాదాపు ఖాయమవుతుంది. అయితే ఇప్పటికే పార్లమెంట్ భవనాన్ని స్వయంగా ప్రారంభించిన మోదీ ఇక అయోధ్య రామమందిరాన్ని కూడా పూర్తి చేసి, ప్రారంభిస్తే తనకు తిరుగుండదని భావిస్తున్నట్లుగా సమాచారం. దీంతో పాటు ఉత్తర ప్రదేశ్ లో ఆలయాల పునరుద్ధరణ కూడా చేపడితే యూపీలో మెజార్టీ సీట్లు తమ ఖాతాలో పడినట్లేనని కమలం నేతలు భావిస్తున్నారు.
పడిపోతున్న మోదీ గ్రాఫ్
దేశంలో రోజురోజుకూ మోదీ గ్రాఫ్ పడిపోతున్నట్లుగానే సర్వేలు చెబుతున్నాయి. కేవలం తన సొంత సర్వేల్లోనే మోదీ గొప్పతనం ఉంటున్నది. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. పేద ప్రజలను పట్టించుకోకపోవడం, ధరల నియంత్రణ పై దృష్టి పెట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ఇక ఇప్పటికే అన్నదాతల అంశం మోదీకి పెద్ద మచ్చ తెచ్చింది. మరోవైపు రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలపై మోదీ ప్రభుత్వ తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆడపిల్లలకు అన్యాయం జరిగినా పట్టించుకోకుండా, సొంత పార్టీ ఎంపీని కాపాడుకునేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించడం చేటు చేస్తున్నది. బిహార్, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో బీజేపీకి పూర్తిగా ఎదురుగాలే వీస్తున్నది. మొన్నటి కర్ణాటక ఎన్నికల్లో ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మోదీ అన్నీ తానై ప్రచారం నిర్వహించినా, హామీల వర్షం కురిపించినా కన్నడిగులు కనికరించలేదు. సౌతిండియాలో ఇప్పటికే బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది. అధికారంలోకి వచ్చి పదేళ్లయినా సగటు జీవికి ఆశాజనక పాలననందించడంలో మోదీ విఫలమయ్యారు. ఆయన ఏదో చేస్తారని నమ్మిన వాళ్లంతా ఇప్పుడు పెదవి విరుస్తున్నారు. కేవలం అభిమానులు, కమల నాథులు మాత్రమే ఇప్పుడు ఆయన వెన్నంటి ఉన్నారు. భయపెట్టి దక్కించుకున్న మీడియా ఆయన భజన చేస్తున్నా, ఎక్కడా ఆయనకు అనుకూలంగా ఫలితాలు వచ్చేలా కనిపించడం లేదు. రానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో మోదీ మానియాకు పతనం ఖాయమవుతుందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని తెలుస్తున్నది. అందుకే మరోసారి రామ మందిరం అంశమే మోదీకి శ్రీ రామ రక్ష. దేశంలో ప్రజల స్థితిగతులు ఉన్నా రాజకీయ నాయకులకు ఇలాంటి భావోద్వేగాలే కావాలి. అవే వారికి అధికారాన్ని కట్టబెడుతాయి. మరి రానున్న రోజుల్లో రామమందిర ప్రారంభోత్సవం ఇక కీలకం కానుంది. ఇక ఆ తర్వాతే ఎన్నికలు.






