
హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ తదుపరి కాన్సుల్ జనరల్ గా నియమితులైన జెన్నిఫర్ లారెన్స్ ను వాషింగ్టన్ డీసీ లో ఘనంగా సత్కరించారు ప్రవాసాంధ్రులు. అమెరికాలో ఉంటున్న తెలుగువాళ్లు పెద్ద సంఖ్యలో ఈ వేడుకకు హాజరయ్యారు. జెన్నిఫర్ లారెన్స్ గౌరవార్థం విందు కూడా ఏర్పాటు చేసారు.
తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జెన్నిఫర్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు అలాగే ప్రవాసాంధ్రులకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని , అలాగే కరోనా కారణంగా వీసాల పునరుద్ధరణ జరగలేదని , అలా పెండింగ్ లో ఉన్న వీసాలను వెంటనే మంజూరు చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొంది. అంతేకాదు 55 వీసా ఇంటర్వ్యూ కేంద్రాలను హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది జెన్నిఫర్. ఈ కార్యక్రమంలో పులి రవి , డాక్టర్ రవి కోట , పార్ధ కారంచెట్టి , భాను ఇల్లింద్ర , సంతోష్ సోమిరెడ్డి , జయంత్ చల్లా తదితరులు పాల్గొన్నారు.