ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నాటు నాటు అనే పాట రాసి యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన గేయ రచయిత చంద్రబోస్. ఈ పాటకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ఊర మాస్ హీరోలు ఎన్టీఆర్ , చరణ్ అద్భుతమైన డ్యాన్స్ తో మరింత రక్తి కట్టించారు. దాంతో ఆస్కార్ అవార్డ్ వరించింది ఈ పాటను. ఆస్కార్ అవార్డ్ రాకతో ఇప్పుడు ఎక్కడ చూసినా నాటు నాటు పాట మారుమ్రోగుతూనే ఉంది. భారతీయ సినిమాకు అందునా తెలుగు సినిమాకు ఆస్కార్ రావడంతో పలువురు భారతీయులు , అందునా తెలుగువాళ్లు …… మరీ ముఖ్యంగా విదేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు పరవశించిపోతున్నారు. ఆస్కార్ అవార్డ్ అందుకున్న చంద్రబోస్ ను ఘనంగా సన్మానించాలని భావించిన ఎన్నారైలు న్యూజెర్సీలోని ఎడిసన్ లో భారీ ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గేయ రచయిత చంద్రబోస్ హాజరయ్యారు. Electrifying Rhythms పేరుతో టెస్లా కార్లతో మార్చి 19 న ఎడిసన్ లో నాటు నాటు సాంగ్ ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. నాటు నాటు అనే పాట బీట్ కు తగ్గట్లుగా అద్భుతమైన లైటింగ్ తో ఈ పాటను ప్రదర్శించారు. టెస్లా కార్లతో మెరుపులకు తగ్గట్లుగా నాటు నాటు సాంగ్ ప్రదర్శన ఎన్నారైలను పరవశింపజేసింది.
చంద్రబోస్ ను ఘనంగా సన్మానించారు పలువురు ప్రవాసాంధ్రులు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన చంద్రబోస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాలో ఉన్న తెలుగువాళ్లు నాకు సన్మానం చేయడం సంతోషంగా ఉందన్నారు చంద్రబోస్. తెలుగు రాష్ట్రలనుండి ఇక్కడకు వచ్చి అగ్రరాజ్యం అమెరికాలో సత్తా చాటుతూ తెలుగువాడి ప్రతిభను యావత్ ప్రపంచానికి చాటిచెబుతున్న మీ అందరికి నా కృతజ్ఞతలు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారైలు భాగస్వామ్యం కాగా UBlood app ఫౌండర్ , JSW & Jaiswaraajya.tv సంస్థల శ్రేయోభిలాషి డాక్టర్ జై యలమంచిలి , JSW & Jaiswaraajya.tv సంస్థల గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ లతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి JSW & Jaiswaraajya.tv నిర్వహణ భాగస్వామి కావడం విశేషం.
ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్.