తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకోవడానికి బీజేపీ సైలెంట్ వ్యూహం పన్నుతోంది. ఇప్పటికే తెలంగాణలో బలం పెంచుకుంటున్న ఆ పార్టీ ఇప్పుడు ఏపీలోనూ తనదైన ముద్ర వేయాలనుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో లేకున్నా కేంద్రం లెవల్లో ఇక్కడి ప్రజలను ఆకర్షిస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాలు ఆరాధ్య దేవుడిగా భావించే నందమూరి తారకరామారావు చిత్రాన్ని రూ.100 కైన్ పై ముద్రించడానికి ప్రతిపాదించింది. ఈ నాణెలకు సంబంధించిన సలహాలు, సూచనలు అడిగేందుకు ఆయన కుమార్తె పురంధేశ్వరి వద్దకు మింట్ అధికారులు వచ్చారు. ఈ నమునాకు పురంధేశ్వరి అంగీకారం తెలిపినట్లు సమాచారం. వీలైనంత త్వరలోనే ఈ కాయిన్ బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో భాగంగానే రూ.100 కాయిన్ తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు.
దేశ వ్యాప్తంగా రాజకీయాలు నడిపిన నందమూరి తారకరామారవుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని బీజేపీ నేత వెంకయ్యనాయుడు సైతం పార్లమెంట్ లో డిమాండ్ చేశారు. ఆయనపై ఉన్న అభిమానంతో పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు కూడా. ఈ డిమాండ్ల ను పరిగణలోకి తీసుకున్న కేంద్రం భారతరత్న ఇవ్వడానికి ముందుకు రాలేదు. కానీ రూ.100 కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మను వేయడం వల్ల చిరస్థాయిగా నిలిచిపోతుందని భావించారు. ఎన్టీఆర్ కు ఈ గౌరవం ఇవ్వడం వల్ల తమ ప్రభుత్వాన్ని ఆదరిస్తారని కమలనాథులు ఆలోచించినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ రకరకాల ప్లాన్లు వేస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి పలు రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. కొన్ని నెలల కిందట అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పడు జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అయ్యారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా నేపథ్యంలోనే ఎన్టీఆర్ ను కలిశారని అంటున్నారు. కానీ రాజమౌళి, రామ్ చరణ్ ను ఎందుకు ఆహ్వానించలేదని కొందరు ప్రశ్నించారు.
ఇప్పడు సీనియర్ ఎన్టీఆర్ విషయంలో అరుదైన గౌరవం ఇవ్వడం ద్వారా బీజేపీ మార్కులు కొట్టేయాలని చూస్తోంది. తెలుగు రాష్ట్రాలకు తాము ఆదరిస్తామని చెప్పడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆ కుటుంబానికి చెందిన పురంధేశ్వరిని పార్టీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేకాకకుండా ఆమెకు ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. ఇప్పుడు రూ.100 కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మ వేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులను దోచేయాలని చూస్తున్నారు.