
మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు YS వివేకానంద రెడ్డి హత్య జరిగి సరిగ్గా నాలుగు సంవత్సరాలు. 2019 మార్చి 15 న తెల్లవారు జామున వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే గుండెపోటుతో మరణిస్తే ఒంటిపై కత్తి పోట్లు, గాయాలు , రక్తం మడుగు ఎలా ? ప్రశ్నలు తలెత్తాయి. సాయంత్రానికి మొత్తం వ్యవహారం మారిపోయింది. వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు అనే విషయం తెలియడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. వివేకానంద రెడ్డి హత్య సంచలనంగా మారింది.
వివేకానంద రెడ్డిది సాధారణ మరణం కాదని దారుణమైన హత్య అని తెలుసుకున్న వివేకా కుటుంబం న్యాయం కోసం నాలుగేళ్లుగా పోరాడుతూనే ఉంది. కడప ఎంపీ సీటు కోసమే వైఎస్ అవినాష్ రెడ్డి తన తండ్రిని చంపించాడని వివేకా కూతురు డాక్టర్ సునీతా రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తోంది. కోర్టుకెక్కి సీబీఐ విచారణ అయ్యేలా కూడా చేసింది. అయితే ఈ కేసు రోజు రోజుకు అనూహ్య మలుపులు తిరుగుతోంది కానీ ఇంకా ఎవరు దోషులు అన్నది తేలలేదు.
ఈరోజు తన తండ్రి మరణించి నాలుగేళ్లు కావడంతో నాలుగో వర్ధంతిని నిర్వహించింది వివేకా కూతురు డాక్టర్ సునీత రెడ్డి. నా తండ్రి మరణానికి కారకులు ఎవరో నాకు తెలియాల్సి ఉంది. అందుకే న్యాయ పోరాటం చేస్తున్నానని స్పష్టం చేసింది.
వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానంద రెడ్డి అన్నకు తోడుగా రాజకీయాల్లో కొనసాగాడు. అయితే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ తో వివేకానంద రెడ్డికి విబేధాలు తలెత్తాయి. దాంతో జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టినప్పటికి వివేకా మాత్రం జగన్ వెంట నడవలేదు.






