
Janasena Pawan :వడ్డించే వాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ఫర్వాలేదు. అధికారం చేతుల్లో ఉంటే ఏదైనా సాధ్యమే. ఎదుటి వారి నోరు మూయించడానికి ఏపీ ప్రభుత్వం చేయాల్సిన పనులన్ని చేస్తోంది. ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని నోటీసులు జారీ చేయడం దేనికి సంకేతం. ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు కూడా వారు రాసిచ్చినవే చదవాలేమో అని అందరు ఆశ్చర్యపోతున్నారు.
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని పవన్ కు, సభ నిర్వహణ అనుమతి కోసం దరఖాస్తు చేసిన పార్టీ కార్యదర్శి కోన తాతారావుకు పోలీసులు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సభలో పవన్ ప్రసంగం ఆక్షేపణ కరంగా ఉందని పోలీసులు పేర్కొనడం గమనార్హం.
సెక్షన్ 30కి విరుద్ధంగా ప్రసంగించిన పవన్ కల్యాణ్ నిరాధార, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించబోమంటూ అఫిడవిట్ ఇవ్వాలని పవన్ ను ఆదేశించారు. పవన్ కల్యాణ్ ప్రసంగం రాజకీయంగా ఉందని, సీఎంను విమర్శించడం తగదని సూచిస్తున్నారు. వారు రాసిచ్చిన స్క్రిప్ట్ నే చదవాలని అంటున్నారని పవన్ మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో జనసేన నాయకులు మండిపడుతున్నారు. వైసీపీ నేతల బెదిరింపులకు బెదిరేది లేదని చెబుతున్నారు. ప్రభుత్వం ఇలా ఒత్తిడి చేయడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. నోటీసుల పేరుతో భయపెడితే బెదిరే వారు లేరని అంటున్నారు. వైసీపీ నియంతలా వ్యవహరించడం తగదని హెచ్చరిస్తున్నారు. పవన్ ప్రసంగంపై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






