ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల మంత్రి అదిమలుపు సురేష్ వర్సెస్ చంద్రబాబు నాయుడుగా పేలిన మాటల తూటాలు…ఇప్పుడు తాజాగా మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిని టార్గెట్ చేశారు. మచిలీపట్నాన్ని పేర్ని నాని హోల్ సేల్ గా లూటీ చేయడానికి కుట్ర చేస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నాన్ని నాశనం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టిడిపి హయాంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడాను ఏర్పాటు చేశామని పేర్కొన్న కొల్లు రవీంద్ర, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
ఇటీవల ముడా అధికారులు తయారుచేసిన మాస్టర్ ప్లాన్ అంతా లోపభూయిష్టంగా ఉందని, అనేక తప్పులు దొర్లాయన్నారు.ప్రైవేటు ఆస్తులను దోచుకునే లాగా మాస్టర్ ప్లాన్ ను తయారు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి అవసరాలను మాస్టర్ ప్లాన్ లో ఏవిధంగా తీరుస్తారో చెప్పలేదని, గుడిని , బడిని కూడా దోచుకునేలా తయారుచేసిన మాస్టర్ ప్లాన్ పై ప్రజలు స్పందించాలన్నారు. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి తప్పుల తడకగా ఉన్న మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.